Supreme Court: మిస్సింగ్ కేసుల్లో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: సుప్రీంకోర్టు కీలక ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
ఒక వ్యక్తి కనిపించకుండా పోయినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదృశ్యమైన వ్యక్తి వయసు, లింగంతో సంబంధం లేకుండా మిస్సింగ్ కేసులో తక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. గతంలో తాము జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉపయోగించిన 'పర్సన్' అనే పదాన్ని కేవలం పిల్లలకు మాత్రమే వర్తించేలా కొన్ని రాష్ట్రాలు అర్థం చేసుకోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
వివరాలు
పెద్దలకు వర్తించదనుకోవడం తప్పే
'పర్సన్' అనే పదం పిల్లలకు మాత్రమే వర్తిస్తుందని, పెద్దలకు వర్తించదని కొన్ని రాష్ట్రాలు భావిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ విషయం తెలిసి తాము తీవ్రంగా ఆశ్చర్యపోయామని వ్యాఖ్యానించింది. ఇది ఉద్దేశపూర్వకంగా సృష్టించుకున్న భ్రమగా భావిస్తున్నామని తెలిపింది.
గతంలో ఇచ్చిన తమ ఉత్తర్వుల్లోని అంశాలు స్పష్టంగానే ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.
'వ్యక్తి' అనే పదం వయసు లేదా లింగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ సూచిస్తుందని స్పష్టం చేసింది.
అందువల్ల పిల్లలు మాత్రమే కాకుండా ఏ వ్యక్తి అదృశ్యమైనా పోలీసులు తక్షణమే స్పందించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.
వివరాలు
వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలి
మిస్సింగ్ అయిన వ్యక్తిని గుర్తించేందుకు అవసరమైన బృందాలను ఎలాంటి ఆలస్యం లేకుండా రంగంలోకి దించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఒక వ్యక్తి కనిపించకుండా పోయిన తర్వాత తొలి గంటలు అత్యంత కీలకమైనవని పేర్కొంది.
ఆ సమయంలో పోలీసులు వేగంగా చర్యలు చేపడితే అదృశ్యమైన వ్యక్తిని గుర్తించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపింది.
కుటుంబ సభ్యులకు వెంటనే అప్పగించాలి
అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ లభించి, అతడిని లేదా ఆమెను కాపాడిన తర్వాత కూడా పోలీసులు జాప్యం చేయకూడదని సుప్రీంకోర్టు సూచించింది.
రక్షించిన వ్యక్తిని ఎలాంటి ఆలస్యం లేకుండా వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని స్పష్టం చేసింది.
వివరాలు
ఆదేశాలు ఉల్లంఘిస్తే ధిక్కరణ చర్యలు
మిస్సింగ్ కేసులకు సంబంధించి గతంలో జారీ చేసిన సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా పాటించాలని ధర్మాసనం హెచ్చరించింది.
ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.