IndiGo: విమాన రద్దుల బాధితులకు ఊరట.. 26 నుంచి ఇండిగో పరిహారం
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల భారీగా విమానాలను రద్దు చేసి ప్రయాణికులను తీవ్ర అసౌకర్యాలకు గురిచేసిన ఇండిగో ఎయిర్లైన్స్, ఇప్పుడు వారికి పరిహారం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ నెల 3, 4, 5 తేదీల్లో విమానాశ్రయాల్లో గంటల తరబడి చిక్కుకుపోయిన అర్హులైన ప్రయాణికులకు డిసెంబర్ 26 నుంచి ఒక్కొక్కరికి రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ఉన్న పరిహారానికి ఇది అదనంగా ఉంటుందని స్పష్టం చేసింది. విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ సిన్హా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన ప్రతి ప్రయాణికుడికి ఆలస్యం లేకుండా పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని ఇండిగోను ప్రభుత్వం ఆదేశించింది.
Details
వారం రోజుల్లో చెల్లింపులు ప్రారంభించాలి
నేరుగా ఇండిగో అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారం రోజుల్లోనే చెల్లింపులు ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే ట్రావెల్ ఏజెంట్లు, ఆన్లైన్ పోర్టళ్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల వివరాలను సేకరించి, వారికి కూడా నేరుగా పరిహారం అందించాలని ఇండిగోకు సూచించారు. ఈ మొత్తం ప్రక్రియను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్ సేవా పోర్టల్ ద్వారా విమానయాన శాఖ పర్యవేక్షించనుంది. విమానాలు రద్దైన సందర్భాల్లో ఇండిగో రిఫండ్ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ, ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న అనేక మందికి ఇప్పటికీ డబ్బులు అందలేదని తెలుస్తోంది.
Details
9 నుంచి కార్యకలాపాలు సాధారణ స్థితికి
డీజీసీఏ ఆదేశాల మేరకు మేక్ మై ట్రిప్ సంస్థ ఇండిగో నుంచి రిఫండ్ అందకముందే సుమారు రూ.10 కోట్ల వరకు ప్రయాణికులకు తిరిగి చెల్లించినట్లు సమాచారం. ఇక భవిష్యత్తులో ఇలాంటి భారీ వైఫల్యాలు మళ్లీ జరగకుండా సమస్యల మూలాలను గుర్తించేందుకు బయటి సాంకేతిక నిపుణులతో కలిసి పని చేస్తామని ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా వెల్లడించారు. ఈ నెల 8 నుంచి తమ నెట్వర్క్లోని అన్ని గమ్యస్థానాలకు విమాన సేవలను పూర్తిగా పునరుద్ధరించామని, 9వ తేదీ నుంచి కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని కంపెనీ స్పష్టం చేసింది.