India: మరో నౌకపై అమెరికా దాడి అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందంటూ వెలువడిన వార్తలను భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న 'లియాకి ఫ్రీడమ్' నౌక ఒమన్ తీరం వెంబడి ప్రయాణిస్తుండగా, కొంతసేపు నౌక నుంచి కమ్యూనికేషన్ నిలిచిపోయింది. దీంతో ఆ నౌకపై అమెరికా దాడి చేసిందంటూ కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు ప్రసారమయ్యాయి. ఈ ఘటనలో నలుగురు భారతీయ నావికులు మరణించారని కూడా ప్రచారం జరిగింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వార్తలు పెద్దఎత్తున వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన విదేశాంగ శాఖ అధికారులు, నౌకలోని మాస్టర్తో నేరుగా మాట్లాడినట్లు తెలిపారు.
వివరాలు
సిబ్బంది సురక్షితంగా ఉన్నారు
నౌకపై ఎలాంటి దాడి జరగలేదని, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని ధ్రువీకరించారు. నిర్ధారణ లేని వార్తలను నమ్మవద్దని, ఇలాంటి తప్పుడు ప్రచారాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, ఇటీవల ఒమన్ తీరం సమీపంలో భారతీయులు ఉన్న పలు నౌకలపై వరుస దాడులు జరిగిన విషయం తెలిసిందే. వారం వ్యవధిలో మూడు నౌకలను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఈ ఘటనల్లో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తూ, వెంటనే నిలిపివేయాలని అమెరికా ప్రభుత్వానికి అధికారికంగా నిరసన తెలిపింది.
వివరాలు
ఇరాన్ డ్రోన్లను కూల్చివేశాం: అమెరికా
ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లను ప్రయోగించిందని అమెరికా సైన్యం ఆరోపించింది. ఆ డ్రోన్లను తమ బలగాలు విజయవంతంగా కూల్చివేశాయని వెల్లడించింది. ఈ మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని పేర్కొంది. ఇరాన్పై అమలు చేస్తున్న దిగ్బంధన చర్యలు మరింత కఠినంగా కొనసాగుతున్నాయని తెలిపింది. అలాగే నిబంధనలకు అనుగుణంగా ఉన్న 139 వాణిజ్య నౌకలను సురక్షిత మార్గాల్లో దారి మళ్లించినట్లు వెల్లడించింది. మరోవైపు నిబంధనలు పాటించని తొమ్మిది నౌకలను నిలిపివేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.