CM Revanth Reddy: ఓటర్ జాబితా సవరణపై రేవంత్ కీలక లేఖ.. SIR గడువు పెంచాలని డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై అభ్యంతరాలు, క్లెయిమ్ల దాఖలుకు గడువు పొడిగించాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్కుమార్కు లేఖ రాశారు. అక్టోబర్ 19తో ప్రస్తుత గడువు ముగియనున్నందున మరో నాలుగు వారాలు పొడిగించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సమీప భవిష్యత్తులో రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేనందున గడువు పెంచాలని కోరారు. SIR ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని లేఖలో తెలిపారు. ఓటర్ల పరిశీలన ప్రక్రియలో అనేక లోపాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఓటర్లు ఇళ్లు మారిన సందర్భంలో వారికి నోటీసులు ఇవ్వకుండా ఓట్లు తొలగించవద్దని కోరారు.
వివరాలు
ఓటర్ జాబితాను చదివి వినిపించాలి
గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటర్ జాబితాను కనీసం రెండుసార్లు చదివి వినిపించాలని సూచించారు.
నోటీసులు అందుకున్న వారికి సమాధానం ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. మండలస్థాయి అధికారులు ఇచ్చే డాక్యుమెంట్ను కూడా ఆమోదించాలని పేర్కొన్నారు.
అలాగే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అదనపు ఈఆర్వోలను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.