Page Loader
RGV VYUHAM : రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' విడుదలకు బ్రేక్‌.. తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే
తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే

RGV VYUHAM : రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' విడుదలకు బ్రేక్‌.. తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 29, 2023
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'వ్యూహం' సినిమా విడుదలకు బ్రేకులు పడ్డాయి. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు నిలిపేసింది. ఈ మూవీకి కేంద్ర సెన్సార్‌ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను జనవరి 11 వరకు సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సర్టిఫికెట్‌ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదంటూ రామదూత క్రియేషన్స్‌, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌లకు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీర్తి, ప్రతిష్ఠలను దెబ్బతీసేలా రూపొందించిన ఈ సినిమా ప్రదర్శనకు కేంద్ర సెన్సార్‌ బోర్డు అనుమతించడాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కోర్టులో సవాలు చేశారు.

details

మధ్యంతర ఉత్తర్వులు జారీ

ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నంద గురువారం విచారణ చేపట్టారు. ఉదయం 11.45 నుంచి సాయంత్రం దాకా సుదీర్ఘ వాదనలను విన్న జస్టిస్‌ నంద రాత్రి 11.30 తర్వాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సర్టిఫికెట్‌ను సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అంతకుముందు పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధర్‌రావు, ఉన్నం శ్రవణ్‌కుమార్‌లు వాదనలు వినిపిస్తూ భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కక్షపూరితంగా చిత్రాలు నిర్మించడం, ప్రజలను తప్పుదారి పట్టించడం సరికాదన్నారు.

details

ఎటువంటి లాభం లేకపోయినా మళ్లీ అవే సినిమాలు

చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయాలని నిర్మాత, దర్శకుడు బహిరంగంగా ప్రయత్నిస్తున్నారని కోర్టుకు వివరించారు. గతంలో ఇలాంటివే అయిదారు సినిమాలు తీశారని, వాటితో ఎటువంటి లాభం రాకపోయినా మళ్లీ అవే మాదిరి సినిమాలు తీస్తున్నారన్నారు. దీనికి ఒక నేత నుంచి ఆర్థిక సాయం అందుతున్నట్లుందని న్యాయవాదులు అనుమానాలు వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గొప్పగా చూపి, చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో సైతం వైసీపీ మంత్రులు వేదికపై కూర్చున్నారని, రాజకీయ వ్యంగ్య చిత్రాన్ని నిర్మించి సృజన పేరుతో చంద్రబాబు పరువు తీసేందుకు యత్నిస్తున్నారన్నారు.

Details

ట్రైలర్ చూసి మాట్లాడటం సరికాదు : నిర్మాత

సినిమాలో పేర్లు కూడా నేరుగానే పెట్టారని, వ్యక్తి గౌరవ ప్రతిష్ఠలకు ప్రాధాన్యం ఉంటుందంటూ సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ప్యూహం నిర్మాత ఏమంటున్నారంటే.. నిర్మాత తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేవలం ట్రైలర్‌ చూసి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, సినిమాను నిలిపేయాలని కోరడం సరికాదన్నారు. సెన్సార్‌ బోర్డు తరఫున అదనపు ఏజీ పి.నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ ఒకసారి బోర్డు సర్టిఫికెట్‌ జారీ చేశాక కోర్టులు జోక్యం ఉండదన్నారు. ప్రాంతీయ సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరించగా, ఛైర్మన్‌ ద్వారా రివిజనల్‌ కమిటీకి సిఫార్సు చేశామన్నారు. 10 మందితో కూడిన కమిటీ సినిమాను పరిశీలించి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ లాంటి కేసు ప్రస్తావనను, మరికొన్ని పేర్లను తొలగించాలని సూచించిందన్నారు.