Subsea Cables: ప్రమాదంలో సముద్రగర్భ కేబుళ్లు.. కేంద్రం ఇంటర్నెట్ సేవలపై కేంద్రం ఆరా..!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిలోని సముద్రగర్భ కేబుళ్లను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవచ్చని, అలాగే ఎర్ర సముద్రంలోని బాబ్ అల్ మందేబ్ ప్రాంతంలో హూతీలు కేబుళ్లపై దాడులు చేయవచ్చని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీడియో కాల్స్, ఈమెయిల్స్, బ్యాంకింగ్ లావాదేవీలు, ఏఐ సేవలు వంటి డిజిటల్ కార్యకలాపాలన్నీ ఈ అండర్సీ కేబుళ్లపైనే ఆధారపడి ఉంటాయి. అందువల్ల వీటికి ఎలాంటి అంతరాయం వచ్చినా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
వివరాలు
కేంద్రం అప్రమత్తం.. టెలికాం కంపెనీలకు కీలక ఆదేశాలు
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సబ్సీ కేబుల్ ఆపరేటర్లు, టెలికాం సంస్థలకు కీలక సూచనలు జారీ చేసింది. సముద్రగర్భ కేబుళ్లలో అంతరాయం ఏర్పడితే భారత్కు కలిగే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
హర్మూజ్ మార్గం కీలకం.. ప్రత్యామ్నాయాలకు పరిమితులు
భారత్ నుంచి అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లే డేటా ట్రాఫిక్లో దాదాపు మూడో వంతు హర్మూజ్ జలసంధి మార్గం ద్వారానే సాగుతుంది. ఈ మార్గంలో సమస్యలు తలెత్తితే, కొంత ట్రాఫిక్ను సింగపూర్ ద్వారా మళ్లించే అవకాశం ఉన్నప్పటికీ, ఆ సామర్థ్యం చాలా పరిమితంగా ఉందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ మార్పిడి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. పసిఫిక్ మహాసముద్ర మార్గాన్ని ఉపయోగించినా అది చాలా పొడవుగా ఉండటంతో డేటా ప్రాసెసింగ్ వేగం తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
వివరాలు
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం.. దౌత్య చర్చల అవసరం
సముద్రగర్భ మౌలిక వసతుల భద్రత కోసం ఇరాన్తో దౌత్య చర్చలు జరపాలని కేంద్రాన్ని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దాడులు జరిగినా కేబుళ్లు పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశాలు తక్కువేనని భారతీయ సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ అధికారి హర్షరామ్ తెలిపారు. కానీ కేబుళ్లు దెబ్బతింటే మాత్రం బ్యాంకింగ్ లావాదేవీలు, సోషల్ మీడియా, ఈ-కామర్స్, ఐటీ సేవలు వంటి కీలక రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
వివరాలు
సముద్ర కేబుళ్లకు మరమ్మతులు నిలిపివేత
ఇటీవల పరిస్థితుల నేపథ్యంలో సముద్ర కేబుళ్లకు మరమ్మతులు చేసే నౌకలు కూడా తమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు సమాచారం. దీంతో టాటా కమ్యూనికేషన్స్కు చెందిన TGN-Gulf నెట్వర్క్, ఎయిర్టెల్ సహా ఇతర వ్యవస్థలు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. జెడ్డా సమీపంలో ఫ్లాగ్ టెలికాం సంస్థకు చెందిన ఫాల్కన్ కేబుల్స్ కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అలాగే రిలయన్స్ జియో, గ్లోబల్ టెక్ కంపెనీలకు సంబంధించిన కొత్త కేబుళ్లు కూడా ఇదే మార్గంలో నిర్మాణంలో ఉన్నట్లు సమాచారం.