Page Loader
YS Jagan: జగన్‌పై రోడ్డుప్రమాదం కేసు.. చట్టం, శిక్ష, పరిణామాలు ఏంటో తెలుసా?
జగన్‌పై రోడ్డుప్రమాదం కేసు.. చట్టం, శిక్ష, పరిణామాలు ఏంటో తెలుసా?

YS Jagan: జగన్‌పై రోడ్డుప్రమాదం కేసు.. చట్టం, శిక్ష, పరిణామాలు ఏంటో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2025
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిపై రోడ్డు ప్రమాదం కేసులో A2 నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జూన్ 18న గుంటూరు జిల్లాలోని ఎటుకూరు బైపాస్‌ వద్ద జరిగింది. జగన్‌ రెంటపల్ల గ్రామానికి పర్యటనలో ఉన్న సమయంలో, ఆయన కాన్వాయ్‌లోని ఒక వాహనం చీలి సింగయ్య (55) అనే వ్యక్తిని ఢీకొట్టింది. సింగయ్య వైసీపీ కార్యకర్త, జగన్‌ స్వాగతానికి పూలు చల్లే క్రమంలో కాన్వాయ్‌ సమీపానికి వచ్చారు.

Details

తీవ్ర కలకలం రేపిన ప్రమాదం 

ఈ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కార్యకర్తలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌, డ్రోన్‌ వీడియోలు పరిశీలించి, ప్రత్యక్ష సాక్షుల వివరాలు సేకరించారు. ఈ విచారణలో, జగన్‌ ప్రయాణిస్తున్న AP 40 DH 2349 నంబర్‌ గల ఫార్చ్యూనర్‌ కారు సింగయ్యను ఢీకొట్టినట్లు తేలింది. తీవ్రంగా గాయపడిన సింగయ్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు, కానీ చికిత్స పొందుతూ మృతిచెందారు.

Details

కేసులో మారిన సెక్షన్లు 

మృతుడు సింగయ్య భార్య చీలి లూర్ధ్‌ మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మొదట భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 106(1) (నిర్లక్ష్యంతో మరణానికి కారణం) కింద కేసును నమోదు చేశారు. కానీ వీడియో ఫుటేజ్‌, ఇతర సాక్ష్యాల ఆధారంగా పోలీసులు కేసును మరింత తీవ్రమైన సెక్షన్లకే మార్చారు. ఇప్పుడు BNS సెక్షన్‌ 105 (హత్య కాని మరణం) మరియు సెక్షన్‌ 49 (దుర్మార్గపు చర్యకు సహకరించడం) కింద కేసు నమోదు చేశారు. కేసులో A1, A2, A3 నిందితులు కారు నడిపిన డ్రైవర్‌ రమణారెడ్డి A1 నిందితుడు, జగన్‌ A2 నిందితుడు, కారు యజమాని, జగన్‌ మాజీ OSD కృష్ణమోహన్‌ రెడ్డి A3 నిందితుడిగా ఉన్నారు.

Details

 తప్పు జగన్‌దేనా? 

అంతేకాకుండా వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, మాజీ మంత్రి విడదల రజిని, జగన్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ K నాగేశ్వర్‌ రెడ్డిని కూడా నిందితులుగా చేర్చారు. పోలీసుల ప్రాథమిక విచారణలో జగన్‌ కాన్వాయ్‌ కు 14 వాహనాలకే అనుమతి ఉన్నప్పటికీ, సుమారు 50 వాహనాలు అనధికారికంగా చేరినట్లు తేలింది. ఇది ప్రమాదానికి కారణం కావచ్చు అని భావిస్తున్నారు. జగన్‌ నేరుగా వాహనాన్ని నడపకపోయినప్పటికీ, అనధికారిక కాన్వాయ్‌కి అనుమతించడం పరోక్ష బాధ్యత కింద రావచ్చని విశ్లేషకులు అంటున్నారు. జగన్‌ అరెస్టుపై అనిశ్చితి జగన్‌ అరెస్టుపై పోలీసులు ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. గుంటూరు ఎస్పీ సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ, ''దర్యాప్తు జరుగుతోంది. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Details

చట్టం ఏం చెబుతోంది? 

కేసులో జగన్‌ నేర బాధ్యత ఉంటుందా అనేది తేలాల్సిన ముఖ్యాంశం. వాహనాన్ని నడిపింది డ్రైవర్‌ రమణారెడ్డి కాబట్టి ప్రాథమిక బాధ్యత ఆయనదే. కానీ అనధికారిక కాన్వాయ్‌ వచ్చేందుకు అనుమతించడం వల్ల జగన్‌ పరోక్ష బాధ్యత ఉన్నదా అనేది కోర్టు నిర్ణయించాలి. ప్రమాదానికి అది కారణమా అనే అంశాన్ని సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిర్ధారిస్తారు.

Details

BNS సెక్షన్ 49 ప్రాముఖ్యత 

BNS సెక్షన్‌ 49 ప్రకారం, జగన్‌ 'దుర్మార్గపు చర్య'కు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే, ప్రమాదం జరిగినప్పటికీ వాహనాన్ని ఆపకపోవడమే కాకుండా, బాధితుడిని ఆసుపత్రికి తరలించకపోవడమే ప్రధాన ఆరోపణ. ఇలాంటి సందర్భంలో నేర బాధ్యత ప్రయాణంలో ఉన్న వారందరిపైనా ఆధారపడవచ్చు. ''ప్రమాదం తర్వాత వాహనం ఆపారా, ప్రాథమిక సహాయం అందించారా?'' అనేది ఇప్పుడు విచారణలో కీలకాంశం. పోలీసుల విచారణ పూర్తయిన తర్వాతే చట్టపరమైన పరిణామాలు స్పష్టమవుతాయని అధికారులు తెలిపారు.