
Sanjay Raut: ఠాక్రే సోదరుల కలయికపై ఊహాగానాలు.. స్పందించిన సంజయ్ రౌత్
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర రాజకీయాల్లో విభేదాల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉన్న ఠాక్రే కుటుంబంలోని ఇద్దరు కీలక నేతలు రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు మళ్లీ కలిసే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ఈ చర్చలకు బలం చేకూర్చాయి. రాష్ట్ర ప్రయోజనాలే ప్రథమం అని స్పష్టం చేస్తూ.. ఉద్ధవ్తో తనకు ఉన్న విభేదాలు తక్కువవేనని పేర్కొన్నారు.
అవసరమైతే వాటిని పక్కన పెట్టేందుకు సిద్ధమని రాజ్ అభిప్రాయపడ్డారు.
అయితే ఈ వ్యాఖ్యలపై శివసేన (ఠాక్రే గ్రూప్) ప్రధాన నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఇది కేవలం భావోద్వేగాల్ని ప్రతిబింబించే మాటలేనని అన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు.
Details
వారి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోలేదు
అయినా భవిష్యత్తులో రాజకీయ కూటమి ఏర్పడే అవకాశాన్ని మాత్రం పూర్తిగా ఖండించలేదు.
ఉద్ధవ్, రాజ్ ఇద్దరూ సోదరులని, వారి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోలేదని పేర్కొన్నారు. మళ్లీ కలిసి పనిచేయాలన్న ఆలోచన వారు స్వయంగా చేసుకోవాల్సిన విషయమని రౌత్ తెలిపారు.
ఇటీవల చిత్రదర్శకుడు మహేష్ మంజ్రేకర్ పాడ్కాస్ట్లో మాట్లాడిన రాజ్ ఠాక్రే.. "నేను ఉద్ధవ్తో కలిసి పనిచేయడానికి సిద్ధం, కానీ ఆయన సిద్ధమా అన్నదే ప్రశ్న అని వ్యాఖ్యానించారు.
అనంతరం ఉద్ధవ్ స్పందిస్తూ.. బీజేపీ సహకారంలో మహారాష్ట్రకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తుల నుంచి రాజ్ దూరంగా ఉండాలని సూచించారు.
ఈ ప్రకటనలతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఠాక్రే సోదరుల కలయికపై చర్చలు మళ్లీ జోరుగా నడుస్తున్నాయి.