ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో గ్రూప్కు చెందిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడానికి దిల్లీ కోర్టు గురువారం అనుమతించింది. ఈ కేసులో అప్రూవర్గా మారిన రెండవ వ్యక్తి శరత్ చంద్రారెడ్డి కావడం గమనార్హం. గత నవంబర్లో మద్యం వ్యాపారి దినేష్ అరోరా అప్రూవర్గా మారారు. ఈ కేసులో ఇటీవల చంద్రారెడ్డిపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇది మరింత ఇబ్బంది పెట్టే పరిణామంగా మారనుంది.