West Bengal: బెంగాల్లో సంచలనం.. జుడిషియల్ అధికారుల నిర్బంధం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్లో జుడీషియల్ అధికారులను నిర్బంధించిన ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆ ఘటనకు మాస్టర్మైండ్గా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం బరోడా ఎయిర్ పోర్టు వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ బెంగాల్లోని మాల్దా జిల్లాలో బుధవారం ఏడుగురు జుడీషియల్ అధికారులను నిరసనకారులు ఘెరావ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనుక ఉన్న ప్రధాన నిందితుడిగా మొఫక్కరుల్ ఇస్లామ్ను పోలీసులు గుర్తించారు. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన అతను పారిపోవడానికి విమానం ఎక్కే ప్రయత్నం చేస్తున్న సమయంలో అరెస్టు చేశారు. కాలియాచాక్లో జరిగిన ఈ ఘటనలో బీడీఓ కార్యాలయంలో ఏడుగురు జడ్జీలను నిర్బంధించిన కుట్రకు ఇతడే మాస్టర్మైండ్ అని అధికారులు వెల్లడించారు.
వివరాలు
అసలు ఏమైంది?
ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 33 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక ఐఎస్ఎఫ్ అభ్యర్థి కూడా ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఎస్ఆర్)విధుల్లో పాల్గొంటున్న జుడీషియల్ అధికారులను నిర్బంధించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జుడీషియల్ అధికారులను అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కోర్టు, దీనిని 'నేరపూరిత వైఫల్యం'గా అభివర్ణించింది. ఈ కేసులో దర్యాప్తును సీబీఐ లేదా ఎన్ఐఏతో జరిపించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. సర్వే ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు కలగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని కూడా ఆదేశించింది. మొత్తానికి ఈ ఘటన బెంగాల్ పాలన, భద్రతా వ్యవస్థలపై తీవ్ర చర్చకు దారితీసింది.