Sensex crashes: మూడ్రోజుల్లో సెన్సెక్స్ 2,660 పాయింట్లు పతనం.. రూ.9 లక్షల కోట్ల నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి వరుసగా మూడో రోజు కూడా కొనసాగింది. శుక్రవారం (ఏప్రిల్ 24) ట్రేడింగ్లో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ సుమారు 1 శాతం మేర క్షీణించాయి. దీంతో మార్కెట్లో పెట్టుబడిదారుల ఆందోళన మరింత పెరిగింది. 30 షేర్ల సెన్సెక్స్ ఒక దశలో 1,050 పాయింట్లు లేదా 1.4 శాతం పడిపోయి 76,607 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయికి చేరుకుంది. మరోవైపు నిఫ్టీ 50 కూడా 1.2 శాతం క్షీణించి 23,879 వద్ద రోజు కనిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.466 లక్షల కోట్ల నుంచి రూ.460 లక్షల కోట్లకు పడిపోయింది. ఒక్కరోజులోనే రూ.6 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
వివరాలు
రూ.9 వేల కోట్ల నష్టం..
గత మూడు వరుస సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 2,660 పాయింట్లు లేదా 3.4 శాతం క్షీణించింది. నిఫ్టీ 50 కూడా 2.8 శాతం పడిపోయింది. ఏప్రిల్ 21న బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.469 లక్షల కోట్లు ఉండగా, మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు రూ.9 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. అయితే మార్కెట్ ఇంత భారీగా ఎందుకు పడిపోతోంది? దీనికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
కారణాలివే..
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఇంకా స్పష్టత రాకపోవడం మార్కెట్పై ప్రభావం చూపుతోంది. వాషింగ్టన్, తెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించకపోవడంతో పెట్టుబడిదారులు జాగ్రత్త ధోరణి అవలంబిస్తున్నారు. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ రెండు దేశాలు పరస్పరం దూకుడు తగ్గించలేదు. హోర్ముజ్ జలసంధిలో మైన్లు మోసే చిన్న ఇరానియన్ పడవలను కాల్చివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైన్యానికి ఆదేశించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కూడా బాహ్య దాడులకు వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలంతా ఏకమై ఉన్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు తగ్గే వరకు మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతుందని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు.
వివరాలు
మార్కెట్ను దెబ్బతీసిన చమురు ధరల పెంపు
ముడి చమురు ధరలు ఈ వారం భారీగా పెరగడం కూడా మార్కెట్ను దెబ్బతీసింది. అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలు జరగకపోవడం, శాంతి చర్చలపై సందిగ్ధత కొనసాగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఈ వారం దాదాపు 18 శాతం ఎగిశాయి. ప్రపంచ పెట్రోలియం సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడం కూడా ఇందుకు కారణంగా భావిస్తున్నారు. భారత రూపాయి మరోసారి డాలర్తో పోలిస్తే 94 మార్క్ కంటే దిగువకు పడిపోవడం కూడా మార్కెట్ భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావం చూపింది. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్లో రూపాయి 24 పైసలు బలహీనపడి డాలర్కు 94.25 వద్ద ట్రేడ్ అయింది. ఇది వరుసగా ఐదో రోజు క్షీణతగా నమోదైంది.
వివరాలు
రూ.8,300 కోట్లకు పైగా షేర్ల విక్రయం..
విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు మళ్లీ పెరగడం మరో ప్రధాన కారణం. ఈ నెలలో కొన్ని రోజులు భారత మార్కెట్లో కొనుగోళ్లు చేసిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) ఇప్పుడు మళ్లీ భారీగా అమ్మకాలు చేస్తున్నారు. గత నాలుగు సెషన్లలో క్యాష్ సెగ్మెంట్లో రూ.8,300 కోట్లకు పైగా షేర్లు విక్రయించారు. గత వారం మూడు రోజులు కొనుగోళ్లు చేసిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈ వారం మళ్లీ అమ్మకాల వైపు మొగ్గుచూపారని విజయకుమార్ తెలిపారు. ముడి చమురు ధరల పెరుగుదలతో పాటు ఇది రూపాయిని మరింత బలహీనపరిచిందన్నారు. ఈ ధోరణి కొనసాగితే లార్జ్ క్యాప్ షేర్లు ఇంకా ఒత్తిడిలోనే ఉంటాయని చెప్పారు.
వివరాలు
మార్కెట్పై ప్రభావం చూపిన టెక్నికల్ అంశాలు..
టెక్నికల్ అంశాలు కూడా మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. నిఫ్టీ 24,000 కీలక సపోర్ట్ స్థాయిని కోల్పోయింది. మార్కెట్ ఇప్పటికే ఎక్కువగా పడిపోయినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇంకా దిగువ స్థాయిలకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ ప్రకారం, 50 రోజుల సింపుల్ మూవింగ్ అవరేజ్ అయిన 24,300 స్థాయి తక్షణ రెసిస్టెన్స్గా పని చేస్తుంది. 24,300 దిగువన ఉంటే కరెక్షన్ కొనసాగి నిఫ్టీ 24,000 వరకు పడే అవకాశం ఉందన్నారు. అక్కడి నుంచి మరింత ఒత్తిడి పెరిగితే 23,900 స్థాయికి చేరవచ్చని చెప్పారు. అయితే 24,300 పైకి ఎగబాకితే 24,450 నుంచి 24,500 వరకు రికవరీ కనిపించే అవకాశం ఉందన్నారు.