కొండచరియలు విరిగి కార్లపైకి పడ్డ బండరాయి.. ఇద్దరు మృతి, ముగ్గురు సీరియస్
నాగాలాండ్లోని చమౌకేడిమా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా ఓ పెద్ద బండరాయి అమాంతం రెండు కార్లపై పడింది. దీంతో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఘటనలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరోవైపు చమౌకేడిమా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిమాపూర్ నుంచి కోహిమా మధ్య జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ నేపథ్యంలో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
మరణించిన కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్గ్రేషియా : సీఎం రియో
ఈ క్రమంలోనే పకల్ పహర్ వద్ద వాహనాలు భారీగా క్యూ కట్టాయి. భారీ వర్షాలకు పక్కనే ఉన్న ఓ ఎత్తైన కొండపై నుంచి ఓ పెద్ద బండరాయి రోడ్డుపై ఉన్న వాహనాలపై పడగా, రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. అంతలోనే మరో బండరాయి ఇంకో కారుపై పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఘటన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఘటనపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.