LOADING...
Bomb Threat: శంషాబాద్‌ అలర్ట్‌.. రెండు అంతర్జాతీయ విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపులు!
శంషాబాద్‌ అలర్ట్‌.. రెండు అంతర్జాతీయ విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపులు!

Bomb Threat: శంషాబాద్‌ అలర్ట్‌.. రెండు అంతర్జాతీయ విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2025
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటికే దేశ రాజధాని దిల్లీలో జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌ దేశాన్ని షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో పెద్ద అలర్ట్‌ వెలువడింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్న రెండు అంతర్జాతీయ విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపు మెయిల్స్‌ రావడంతో విమానాశ్రయ భద్రతా విభాగం అప్రమత్తమైంది. అబుదాబి నుంచి శంషాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానం, లండన్‌ నుంచి శంషాబాద్‌ రావాల్సిన బ్రిటిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలకు ఈ బెదిరింపు మెయిల్స్‌ చేరాయి. పరిస్థితి అత్యవసరంగా ఉండడంతో ఇండిగో విమానాన్ని వెంటనే ముంబై విమానాశ్రయానికి మళ్లించారు. లండన్‌ నుంచి బయల్దేరిన బ్రిటిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని షెడ్యూల్‌ కంటే ముందుగానే శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేయించారు.

Details

ఎయిర్‌పోర్టులో భద్రతను మరింత కట్టుదిట్టం

ల్యాండింగ్‌ అనంతరం విమానంలోని ప్రయాణికులందరినీ అత్యవసరంగా దింపి, విమానాన్ని ఎయిర్‌పోర్టులోని ఐసోలేషన్‌ బేకు తరలించారు. అక్కడ బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌లు సీఐఎస్ఎఫ్‌ పర్యవేక్షణలో గట్టి తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు తర్వాత శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. తరచూ బాంబు బెదిరింపు కాల్స్‌ రావడంతో తనిఖీలను మరింత దృఢంగా చేపడుతున్నారు.

Details

విస్తృత తనిఖీలు

ఇటీవ‌ల నవంబర్‌ 12న కూడా శంషాబాద్‌ సహా ఆరు ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టును పేల్చివేస్తామంటూ వచ్చిన మెయిల్‌ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కార్యాలయానికి చేరింది. అదేవిధంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, గోవా, తిరువనంతపురం విమానాశ్రయాల్లో కూడా బాంబులు ఉన్నాయంటూ ఇండిగో, ఎయిర్‌ ఇండియాకు మెయిల్స్‌ పంపించారు. వెంటనే భద్రతా దళాలు రంగంలోకి దిగి విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఐపీ అడ్రెస్‌ ఆధారంగా దర్యాప్తు జరిపిన అధికారులు ఎక్కడా అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో కొంత ఉపశమనం పొందారు.