Page Loader
SIT enquiry: నెయ్యి సరఫరా టెండర్లపై.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్‌ భేటీ
నెయ్యి సరఫరా టెండర్లపై.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్‌ భేటీ

SIT enquiry: నెయ్యి సరఫరా టెండర్లపై.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్‌ భేటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 30, 2024
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా విషయంపై దర్యాప్తును గుంటూరు రేంజీ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్‌ వేగవంతం చేసింది. ఆదివారం సిట్‌ సభ్యులు సమావేశమై, ఎవరు ఏ అంశాలు విచారించాలన్న బాధ్యతలు పంచుకున్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యక్తులు, సంస్థలపై క్రిమినల్‌ కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు. ఏఆర్‌ డెయిరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేసి, దేవస్థానాన్ని మోసం చేసిందని టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, సిట్‌ దర్యాప్తు ప్రారంభించింది.

వివరాలు 

టెండర్‌ వివరాలు 

ఫిర్యాదులో ఏఆర్‌ డెయిరీ సంస్థ తక్కువ ధరకు నెయ్యి అందించేందుకు ముందుకు వచ్చి, టీటీడిను టెండర్‌ మంజూరు చేసేలా ప్రేరేపించినట్లు పేర్కొన్నారు. వారు కల్తీ నెయ్యి సరఫరా చేసి, టీటీడీను, భక్తులను మోసగించారని, ఈ వ్యవహారాన్ని నేరపూరిత కుట్రగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. సంస్థ ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌-2006ని ఉల్లంఘించిందని ఆరోపణలు చేశారు. సిట్‌ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదివారం టీటీడీ ఈవో శ్యామలరావును కలసి, ఏఆర్‌ డెయిరీకి టెండర్లు కట్టబెట్టిన అంశంపై వివరణ కోరారు. టెండర్లలో ఏ సంస్థలు పాల్గొన్నాయి, గరిష్ఠ, కనిష్ఠ ధరలపై ఎవరు టెండర్‌ వేశారు, సరఫరా తీరు ఎలా ఉన్నది వంటి వివరాలు సేకరించారు.

వివరాలు 

సిట్‌ దర్యాప్తులో వేగం

అనంతరం ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం మురళీకృష్ణను వివరాలు అడిగి, టెండర్‌ ప్రక్రియలో ఏ సంస్థలను పరిశీలించారో తెలుసుకున్నారు. ఎల్‌-1గా వచ్చిన ఏఆర్‌ డెయిరీకి టెండర్‌ కట్టబెట్టిన ముందు ఇతర సంస్థలకు అవకాశం ఇచ్చారా, టెండర్‌ ధరను మార్కెట్‌ ధరతో పోల్చారో వంటి ప్రశ్నలు అడిగారు. సిట్‌ దర్యాప్తులో వేగం పెంచుతూ, సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపనుంది.

వివరాలు 

దర్యాప్తు బృందాలు ఏర్పాటు 

తిరుపతి తూర్పు పోలీస్‌ స్టేషన్‌లో నమోదు అయిన 470/24 కేసుపై సిట్‌ బృందం దర్యాప్తు మొదలు పెట్టింది. కేసు డైరీని పరిశీలించి,విచారణకు ఓ అధికారి నియమించారు. దర్యాప్తు కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసి పంపించనున్నారు. అవసరమైతే మరిన్ని బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఏఆర్‌ డెయిరీకి టెండర్ల కేటాయింపు సహా సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. డెయిరీతో పాటు టీటీడీ అధికారులకు నోటీసులు ఇవ్వడమన్నది ప్రాథమిక దశలో ఉంది. అవసరమైతే అదనపు సమాచారం అందజేస్తారు.