Sonia Gandhi: సోనియా గాంధీకి కంటి శస్త్రచికిత్స.. వైద్యుల పర్యవేక్షణ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఇటీవల కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. సర్జరీ అనంతరం వైద్యుల పర్యవేక్షణలో కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసమైన 10 జన్పథ్కు చేరుకున్నారు. కొన్ని రోజులుగా సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆమె అనారోగ్యానికి సంబంధించిన అధికారిక వివరాలు మాత్రం వెలువడలేదు. ఇదే సమయంలో ఆమె న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె తనయుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఆస్పత్రికి వెళ్లి సోనియా గాంధీని పరామర్శించారు.
వివరాలు
కొంతకాలం ఇంట్లోనే విశ్రాంతి
తాజాగా ఆమెకు కంటి శస్త్రచికిత్స జరిగినట్లు వెల్లడైంది. వైద్యుల సూచన మేరకు కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందారు. పూర్తిగా కోలుకున్న తర్వాత వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. కాగా, సోనియా గాంధీ చాలా కాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పాటు ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి, హిమాచల్ప్రదేశ్లోని షిమ్లాలో ఉన్న ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, అలాగే గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఇటీవల కంటి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైనప్పటికీ, వైద్యుల సూచనల మేరకు ఆమె మరికొంతకాలం ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం.