South Korea: హర్ముజ్ జలసంధి భద్రతకై భారత్తో పనిచేస్తాం: లీ-జే-మ్యూంగ్
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ-జే-మ్యూంగ్ మూడు రోజుల పర్యటన కోసం ఆదివారం భారత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని విమానాశ్రయంలో ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. భారత్ పర్యటన సందర్భంగా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు పెరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్, దక్షిణ కొరియా కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా దిగుమతుల విషయంలో ఏకైక దేశంపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరమని, అది దేశ భద్రతకు సవాల్గా మారవచ్చని స్పష్టం చేశారు.
వివరాలు
చమురు సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం అవసరం
Strait of Hormuz గురించి మాట్లాడుతూ, భారత్, దక్షిణ కొరియా దేశాలు ముడి చమురు, సహజ వాయువు అవసరాల కోసం ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడుతున్నాయని తెలిపారు. అందువల్ల సముద్ర మార్గాల భద్రత అత్యంత కీలకమని అన్నారు. ఆ జలసంధిలో అన్ని నౌకలు స్వేచ్ఛగా,సురక్షితంగా ప్రయాణించేలా చూసేందుకు రెండు దేశాలు పరస్పరం చర్చలు కొనసాగిస్తున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ అంశంపై కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుతున్న అనిశ్చితుల దృష్ట్యా, చమురు సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ నేవీ కాల్పులు జరిపిన ఘటన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
వివరాలు
ఈ రంగాల్లో కీలక ఒప్పందాలు
కాగా ఈ రోజు(సోమవారం) రాష్ట్రపతి భవన్'లో లీ జే-మ్యూంగ్కు సైనిక వందనంతో అధికారిక స్వాగతం పలుకనున్నారు. అనంతరం ఆయన Raj Ghatను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు. తరువాత Hyderabad Houseలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. రక్షణ, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.