కేరళను ఇంకా తాకని నైరుతి రుతుపవనాలు.. మరో 4 రోజులు పట్టే అవకాశం: ఐఎండీ
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది. జూన్ 4 వరకు వర్షాలు కురుస్తాయని తొలుత భారత వాతవరణ శాఖ అంచనా వేసింది. అయితే నిర్దేశిత గడువు దాటినా వానలు కురవకపోవడంతో ఐఎండీ స్పందించింది. ఈ మేరకు తాజాగా అంచనా వేసి, రుతుపవనాల రాకకు మరో మూడు, నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ప్రకటించింది. తాము ముందుగా భావించినట్లు రుతుపవనాలు సకాలంలో రాలేదని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. దక్షిణ అరేబియా సముద్రంలో బలమైన పడమటి గాలులు వీస్తున్న కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. జూన్ 4న సముద్రమట్టానికి అది 2.1 కిలోమీటర్లు చేరుకుందని పేర్కొంది.
రుతుపవనాలు ఆలస్యంగా వస్తే వర్షకాలం పంటలకు ఇబ్బందే
మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఆకాశం దట్టంగా మేఘావృతమై ఉందని, ఫలితంగా మరో 4 రోజుల్లోగా కేరళకు తొలకరి చినుకులు వచ్చే పరిస్థితులు మెరుగవుతాయని భావిస్తున్నట్లు వెల్లడించింది. రుతుపవనాలు ఆలస్యంగా వస్తే వర్షాకాలం పంటలపైనే కాక దేశంలోని మొత్తం వర్షపాతం నమోదుపై తీవ్ర ప్రభావం చూపించే ముప్పు పొంచి ఉందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు : సాధారణంగా ఏటా జూన్ 1నే దక్షిణాది రాష్ట్రం కేరళ తీరాన్ని తాకుతుంది. అనంతరం భారత దేశమంతటా విస్తరించి విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఒక్కో ఏడాది వాటి రాక సుమారు వారం వరకు ఆలస్యమవుతుంటుంది. భారత వాతావరణ పరిస్థితుల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఈ సందర్భంగా ఐఎండీ వివరించింది.