Page Loader
Southwest monsoon: నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై కీలక అప్డేట్ ఇచ్చిన ఐఎండీ 
నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై కీలక అప్డేట్ ఇచ్చిన ఐఎండీ

Southwest monsoon: నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై కీలక అప్డేట్ ఇచ్చిన ఐఎండీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 13, 2024
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ సగటు కంటే 8శాతం అధిక వర్షపాతం నమోదయింది. ఈ పరిస్థితుల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై భారత వాతావరణశాఖ(ఐఎండీ)కీలక ప్రకటన చేసింది. వర్షాల తీవ్రత కొంత తగ్గబోతోందని,రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కావచ్చని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం ఈఏడాది అధికంగా ఉండటంతో భారీ వర్షాలు దేశమంతటా కురిశాయి. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే వర్షపాతం 8శాతం అధికంగా నమోదవ్వడంతో, ప్రజలకు కాస్త రిలీఫ్​ అందించే వార్తను ఐఎండీ ప్రకటించింది. ఉపసంహరణ ప్రక్రియ సెప్టెంబర్ 22న వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే జరిగితే,గత ఎనిమిదేళ్లలో ఇది తొలిసారి వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాలు త్వరగా వైదొలగడం అవుతుంది.

వివరాలు 

కర్ణాటక, తమిళనాడులో విస్తారంగా వర్షాలు పడే అవకాశం

గతేడాది, రుతుపవనాల ఉపసంహరణ సెప్టెంబర్ 25న ప్రారంభమైంది. 2022లో, సెప్టెంబర్ 30న పంజాబ్, దిల్లీ, జమ్ముకశ్మీర్, హిమాచల్​ ప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఉపసంహరణ ప్రక్రియ ముగిసినప్పటికీ, వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది కూడా అల్పపీడన ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవవచ్చని, నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పూర్తిగా ఒక్కసారిగా జరగదని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు. ఈ వారం దేశవ్యాప్తంగా వాతావరణం అనుకూలంగా ఉండటం లేదని, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ, మిగతా ప్రాంతాల్లో పెద్దగా వర్షపాతం ఉండదని తెలిపారు.

వివరాలు 

 8శాతం అధిక వర్షపాతం 

ఐఎండీ సెప్టెంబర్ 19 నుంచి 25మధ్య వర్షపాతంపై అంచనాలు ప్రకటించింది. వాయువ్య భారతం నుంచి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపింది. సెప్టెంబర్ మొదటి 12 రోజుల్లో దేశవ్యాప్తంగా 22.7%అధిక వర్షపాతం నమోదవ్వగా, వాయువ్య భారతంలో 32.3% అధిక వర్షపాతం,తూర్పు,ఈశాన్య ప్రాంతాల్లో 47.4%లోటు, మధ్య భారతంలో 45.1% అధికం, ద్వీపకల్ప భారతంలో 64.1%అధిక వర్షపాతం నమోదయింది. మొత్తంగా, ఈ రుతుపవనాల సీజన్ ప్రారంభమైన జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా 8శాతం అధిక వర్షపాతం నమోదైంది. రుతుపవనాలు సాధారణంగా సెప్టెంబర్ 17న ఉపసంహరణను ప్రారంభిస్తాయి, అక్టోబర్ 15నాటికి దేశం నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంటాయి. వాయువ్య భారతంలో ఉపసంహరణ ఆలస్యం అయితే,అక్టోబర్ నెలలో కోతకు వచ్చే పంటలపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది.