
Hyderabad: హైదరాబాద్ గణేశ్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనోత్సవాల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపడుతోంది. ముఖ్యంగా శనివారం హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ వద్ద జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమాలను వీక్షించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి సందర్భంగా నగరంలో ప్రత్యేక బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ ప్రకటించింది. భక్తులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజా రవాణా సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించింది. అదే విధంగా, ట్రాఫిక్ నియంత్రణలో అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చింది.
వివరాలు
ఈ డిపోలనుండి నిమజ్జనానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో..
చార్మినార్ డివిజినల్ పరిధిలోని బర్కత్పురా, ముషీరాబాద్,ఫలక్నూమా, కాచిగూడ, మెహిదీపట్నం, రాజేంద్రనగర్ డిపోలు నుండి ప్రత్యేక బస్సులు నడిపే ఏర్పాట్లు చేశారు. అలాగే, హయత్నగర్ పరిధిలోని దిల్సుఖ్నగర్, హయత్నగర్-1, హయత్నగర్-2, మిథాని డిపోలు నుండి కూడా నిమజ్జనానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా, కాచిగూడ, రాంనగర్ నుండి బషీర్బాగ్ వరకు, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, మిథాని నుండి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. జామై ఉస్మానియా నుండి ఇందిరాపార్క్ వరకు, గచ్చిబౌలి నుండి లక్డీకాపూల్ వరకు, లింగంపల్లి నుండి రాజేంద్రనగర్ వరకు, పటాన్చెరు నుండి లింగంపల్లి వరకు, అలాగే ఆఫ్జల్గంజ్ నుండి ఆల్ ఇండియా రేడియో వరకు ప్రత్యేక బస్సులు నిరంతరంగా నడపబడనున్నాయని ఆర్టీసీ ప్రకటించింది.