Maharashtra Expressway: మహారాష్ట్ర ఎక్స్ప్రెస్వేపై మినీ బస్- ట్రకు ఢీ.. 12 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు.. కంటైనర్ ట్రక్కును ఢీకొనడంతో కనీసం 12మంది మరణించారు. మరో 23మంది గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మినీ బస్సులో 35 మంది ప్రయాణికు ప్రయాణిస్తున్నారు. బుల్దానా జిల్లాలోని సైలానీ బాబా దర్గాను సందర్శించిన తర్వాత వారు నాసిక్కు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి కింద రూ.2లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000చొప్పు పరిహారం ఇవ్వనున్నట్లు పీఎంఓ ట్వీట్ చేసింది.