Hyderabad: హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర.. నగరంలో ట్రాఫిక్ మార్పులు, ఆంక్షలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
నేడు శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భక్తి వాతావరణం నెలకొంది. అన్ని రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున వేడుకలు జరగనున్నాయి.
వివరాలు
హైదరాబాద్లో శోభాయాత్ర
ఈ సందర్భంగా హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్, ఆకాశ్పురి హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర, ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో సుల్తాన్బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర నేపథ్యంలో సుమారు 3 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
వివరాలు
ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లు
యాత్ర సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సీతారాంబాగ్ బోయగూడ కమాన్ నుంచి వచ్చే వాహనాలను మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వైపు మళ్లించనున్నారు. మంగళ్హాట్, గాంధీ విగ్రహం, పురానాపూల్, జుమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలు టక్కర్వాడీ జంక్షన్ వైపు మళ్లించబడతాయి. ఎంజే బ్రిడ్జ్, బేగంబజార్, అఫ్జల్గంజ్, సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలు జుమ్మేరాత్ బజార్ మార్గంలోకి డైవర్ట్ చేస్తారు. అబిడ్స్ జీపీఓ, సుల్తాన్ బజార్, కోఠి, అబిడ్స్ ప్రధాన రహదారుల వద్ద ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేస్తారు.
వివరాలు
పోలీసుల సూచనలు
బేగంబజార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, కోఠి, కాచిగూడ, అబిడ్స్ ప్రాంతాల్లో శోభాయాత్ర సజావుగా జరిగేలా వాహనదారులు పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతాల్లో ప్రయాణించే వారు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని, వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.