Srisailam Reservoir: శ్రీశైలానికి జలకళ.. 875.50 అడుగులకు చేరిన నీటిమట్టం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్లో పెద్దగా వర్షాలు లేకపోయినా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని జలాశయాలు నిండుతున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ద్వారా విడుదలైన నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. జూరాల నుంచి భారీగా విడుదల జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ద్వారా 24,912 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 40,978 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మొత్తంగా 65,809 క్యూసెక్కుల నీటిని వదిలారు. దీంతో శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 30,512 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
ప్రస్తుతం 875.50 అడుగుల నీటిమట్టం
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885అడుగులు. ప్రస్తుతం నీటిమట్టం 875.50అడుగులకు చేరింది.
జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 165.92టీఎంసీల నీరు నిల్వ ఉంది.
మరోవైపు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి 55,7658క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జెన్కో అధికారులు వెల్లడించారు.
కొనసాగితే త్వరలో గేట్లు ఎత్తే అవకాశం
రానున్న రోజుల్లోనూ ఇదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగితే శ్రీశైలం జలాశయం మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈసారి ఆంధ్రప్రదేశ్లో కనీస వర్షపాతం కూడా నమోదు కాకపోయినప్పటికీ.. ఎగువన ఉన్న తెలంగాణ,కర్ణాటక,మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా,గోదావరి నదులకు మళ్లీ జలకళ వచ్చింది.
వివరాలు
నల్లమలసాగర్కు త్వరలో నీరు
వరద ప్రవాహం ఇదే స్థాయిలో కొనసాగితే త్వరలోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారుతుండటంతో కృష్ణా బ్యాక్వాటర్ ద్వారా వెలుగొండ ప్రాజెక్టుకు నీటిని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపిస్తోంది.
ఈ నెలాఖరుకు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేస్తామని కూటమి ప్రభుత్వం ధీమాగా ఉంది.
శ్రీశైలం జలాశయం నుంచి నల్లమలసాగర్కు కూడా త్వరలో నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని నీటి అవసరాలను తీర్చేందుకు మార్గం సుగమం కానుంది.