YS Jagan : ఏపీ ముఖ్యమంత్రిపై రాయి దాడి.. సీఈసీ సీరియస్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (CM) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తీవ్రంగా స్పందించింది. భద్రతా వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను తమకు అందజేయాలని అధికారులను ఆదేశించింది. రెండ్రోజుల క్రితం ప్రధాని మోదీ సభలో అపశృతి, శనివారం సీఎం వైఎస్ సభలో రాయి దాడి ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) విచారం వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాయిదాడి ఘటన జరిగిన ప్రాంతాన్ని అడుగడుగునా జల్లెడ పడుతున్నారు.
నేటి సాయంత్రానికి నివేదిక
ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాన్నికూడా ఏర్పాటు చేశారు. దాడికి సంబంధించిన ప్రాథమిక నివేదికను విజయవాడ నగర పోలీసు కమిషనర్ క్రాంతి రాణా ఈ రోజు సాయంత్రానికి నివేదికను అందజేయనున్నట్లు సమాచారం. శనివారం విజయవాడలో చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసిరారు. దీంతో ఆయన ఎడమ కంటి పైభాగం లో నుదుటిపై గాయమైంది. దీంతో బస్సులోనే జగన్ కు వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. రాయి దాడికి ముందు, దాడి జరిగే సమయంలో కూడా అక్కడ పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.