Supreme Court: వరుస ప్రజాహిత వ్యాజ్యాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని పలు అంశాలపై వరుసగా 25 ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేసిన ఓ న్యాయవాదిపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టును ఆశ్రయించే ముందు సంబంధిత అధికారులను సంప్రదించాలని పిటిషనర్కు సూచించింది. ముందుగా సమస్య పరిష్కారానికి అవసరమైన మార్గాలను అన్వేషించి, పరిష్కారం సాధ్యంకాకపోతేనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని స్పష్టం చేసింది. ''మీరు మీ వృత్తిపై దృష్టి పెట్టాలి. ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడానికి ముందు సంబంధిత అధికారులను సంప్రదించడం అవసరం. సమస్యను ఎలా పరిష్కరించాలో అంచనా వేయగల సామర్థ్యం కూడా పిటిషనర్కు ఉండాలి. సమస్య పరిష్కారం కాకపోతేనే కోర్టుకు రావాలి'' అని పిటిషనర్ సచిన్ గుప్తాకు ధర్మాసనం సూచించింది. విచారణకు వచ్చిన వ్యాజ్యాలను ఉపసంహరించుకోవడానికి ఆయనకు అనుమతి ఇచ్చింది.
వివరాలు
ఇవన్నీ మీరు అర్ధరాత్రి నిద్రలో లేచి రాశారా?
స్నానానికి ఉపయోగించే సబ్బులో కేవలం క్రిములను నశింపజేసే పదార్థాలనే వాడాలని, శరీరానికి హానికరమైన పదార్థాలను వాడరాదని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సహా పలు అంశాలపై సచిన్ గుప్తా వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ ''ఇవన్నీ మీరు అర్ధరాత్రి నిద్రలో లేచి రాశారా?'' అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్ దాఖలు చేసిన మరో ఐదు అనవసర ప్రజాహిత వ్యాజ్యాలను కూడా కొట్టివేశారు. నిజంగా ప్రజలకు ఉపయోగపడే అంశాలపై వ్యాజ్యాలు వచ్చినప్పుడు వాటి పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం ముందుంటుందని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.