
Suresh Gopi: మరో వివాదంలో సురేశ్ గోపి.. కరువన్నూర్ బ్యాంకు బాధితురాలితో దురుసు ప్రవర్తన
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి మళ్లీ ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఇంటి నిర్మాణానికి సహాయం కోరుతూ ఒక వృద్ధుడు చేసిన దరఖాస్తును ఆయన స్వీకరించడానికి నిరాకరించడం మీదే ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సందర్భంలో అమలు చేయలేని హామీలు ఇవ్వలేనని స్పష్టం చేస్తూ తన వైఖరిని ఆయన సమర్థించుకున్నారు. అయితే బుధవారం తన నియోజకవర్గం త్రిశ్శూర్ పర్యటనలో ఆయన ప్రవర్తన మరోసారి వివాదానికి గురైంది. కరువన్నూర్ సహకార బ్యాంకు కుంభకోణంలో అనేక మంది డిపాజిటర్ల సొమ్ము చిక్కుకుపోయింది. ఈ వ్యవహారంలో సీపీఎం నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉండగా,ప్రస్తుతం ఈడీ దర్యాప్తు జరుపుతోంది.
వివరాలు
నేను దేశానికి మంత్రిని: సురేష్ గోపి
ఈ నేపథ్యంలో డిపాజిట్ చేసిన సొమ్ము తిరిగి పొందడంలో సహాయం చేయాలని ఆనందవల్లి అనే వృద్ధ మహిళ సురేశ్ గోపిని కలిసారు. దీనికి సురేశ్ గోపి స్పందిస్తూ ''వెళ్లి మీ మంత్రికో, ముఖ్యమంత్రికో చెప్పు. ఎక్కువగా మాట్లాడవద్దు'' అంటూ దురుసుగా చెప్పారు. వెంటనే మహిళ ''మీరు కూడా మా మంత్రే'' అని చెప్పగా, సురేశ్ గోపి ''నేను దేశానికి మంత్రిని'' అని సమాధానమిచ్చారు. ఈ ఉదంతం వైరల్గా మారింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆనందవల్లి, లోక్సభ ఎన్నికల ప్రచారంలో సురేశ్ గోపి డిపాజిట్లు వెనక్కు రప్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తాను చేసిన అభ్యర్థనపై గౌరవంగా స్పందించి, పరిశీలిస్తానని చెబితే సరిపోయేదని, కానీ కఠినంగా స్పందించడం బాధ కలిగించిందని ఆమె వ్యాఖ్యానించారు.