Loading...
Tamil Nadu: యూకే పర్యటనలో సీఎం విజయ్‌.. రూ. 12,300 కోట్ల డీల్‌ : 9 వేల ఉద్యోగాలు
యూకే పర్యటనలో సీఎం విజయ్‌.. రూ. 12,300 కోట్ల డీల్‌ : 9 వేల ఉద్యోగాలు

Tamil Nadu: యూకే పర్యటనలో సీఎం విజయ్‌.. రూ. 12,300 కోట్ల డీల్‌ : 9 వేల ఉద్యోగాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే) పర్యటనలో భాగంగా నాలుగు కీలక పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం.. ఈ ఒప్పందాల మొత్తం విలువ దాదాపు రూ.12,300 కోట్లు. వీటి ద్వారా సుమారు 9,000 ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే రూ.1 లక్ష కోట్లకు పైగా విలువైన పెట్టుబడి అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయని ప్రభుత్వం వెల్లడించింది.

వివరాలు 

సంవర్ధన మదర్‌సన్‌తో రూ.11 వేల కోట్ల ఒప్పందం

యూకే పర్యటనలో కుదిరిన ఒప్పందాల్లో అతిపెద్దది సంవర్ధన మదర్‌సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో జరిగింది.

ఈ ఒప్పందం విలువ రూ.11,000 కోట్లు. దీని ద్వారా డిజైన్‌, ఇంజినీరింగ్‌, తయారీ, అసెంబ్లీ రంగాల్లో దాదాపు 7,000 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

ఇతర ఒప్పందాలు.. ఎన్ని ఉద్యోగాలంటే?

గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (చెన్నై): చెన్నైలో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటు కోసం ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (Ernst & Young) ద్వారా ఓ బ్రిటిష్‌ కంపెనీతో రూ.1,000 కోట్ల ఒప్పందం కుదిరింది. దీని ద్వారా 2,000 ఉన్నత స్థాయి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

వివరాలు 

ఇతర ఒప్పందాలు.. ఎన్ని ఉద్యోగాలంటే?

సిగ్మా టెక్నాలజీ గ్రూప్‌: స్వీడన్‌కు చెందిన ఈ సంస్థ చెన్నై, తిరుచిరాపల్లిలోని తన కేంద్రాలను విస్తరించేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ విస్తరణతో సుమారు 600 ఉద్యోగాలు లభించనున్నాయి.

విల్సన్‌ పవర్‌ సొల్యూషన్స్‌: తిరువల్లూరు జిల్లాలో రూ.300 కోట్ల పెట్టుబడితో మరో ఒప్పందం కుదిరింది. దీని ద్వారా దాదాపు 400 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.

ADVERTISEMENT

వివారాలు 

అధునాతన తయారీ, ఈవీలపై దృష్టి

తమిళనాడు ప్రభుత్వం అధునాతన తయారీ (అడ్వాన్స్‌డ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌), ఆటోమొబైల్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఈవీలు), ఎలక్ట్రానిక్స్‌, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లను కీలక ప్రాధాన్య రంగాలుగా గుర్తించింది.

ఈ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

మోటార్‌ స్పోర్ట్స్‌ సిటీపై ప్రణాళికలు

యూకే పర్యటనలో మోటార్‌ స్పోర్ట్స్‌ కూడా ముఖ్యమైన అంశంగా నిలిచింది.

తమిళనాడులో ప్రపంచ స్థాయి మోటార్‌ స్పోర్ట్స్‌ నగరాన్ని అభివృద్ధి చేయడం, రేసింగ్‌కు సంబంధించిన తయారీ, అనుబంధ పరిశ్రమల్లో అవకాశాలను సృష్టించడం వంటి ప్రణాళికలతో ఈ పర్యటనకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ పర్యటనలో భాగంగా సీఎం విజయ్‌ సిల్వర్‌స్టోన్‌ రేసింగ్‌ సర్క్యూట్‌ను సందర్శించారు.

ప్రముఖ నటుడు, రేసర్‌ అజిత్‌ కుమార్‌ పాల్గొన్న రేసును జెండా ఊపి ప్రారంభించారు.

తమిళనాడులో ప్రపంచ స్థాయి మోటార్‌ స్పోర్ట్స్‌ సిటీని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ప్రణాళికలో భాగంగానే ఈ కార్యక్రమం జరిగినట్లు సమాచారం.

వివరాలు 

పెట్టుబడులపై ప్రతిపక్షాల విమర్శలు.. టీవీకే స్పందన

అయితే, పెట్టుబడుల ప్రోత్సాహక కార్యక్రమాల్లో పారదర్శకత లోపించిందని ప్రతిపక్షాలు విమర్శించాయి.

సీఎం విజయ్‌ పర్యటన వివరాలు, సమావేశాలపై స్పష్టత కొరవడిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ విమర్శలపై టీవీకే స్పందించింది.

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పెట్టుబడుల కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో.. దీనిని పోటీ సమాఖ్యవాదం (కాంపిటేటివ్‌ ఫెడరలిజం)లో భాగంగా చూస్తున్నామని తెలిపింది.

ఎంవోయూలు కుదిరిన వెంటనే వాటికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

సెప్టెంబర్‌ 16 వరకు విజయ్‌ యూకేలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో మరిన్ని పెట్టుబడి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని సమాచారం.

ADVERTISEMENT