Telangana Elections : పోలింగ్ వేళ చిక్కుల్లో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత.. ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిక్కుల్లో పడ్డారు. ఈ మేరకు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇదే విషయాన్ని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ వెల్లడించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని డీఏవీ స్కూల్ పోలింగ్ స్టేషన్లో కవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దీన్ని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పేర్కొంటూ కాంగ్రెస్ సీఈసీకి ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (CEO) వికాస్రాజ్ దృష్టికి సైతం తీసుకెళ్లామని నిరంజన్ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం కవితపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన స్పష్టం చేశారు.