LOADING...
Breaking News: మాజీ సిఎంకి గాయం.. యశోద ఆసుపత్రిలో చికిత్స 

Breaking News: మాజీ సిఎంకి గాయం.. యశోద ఆసుపత్రిలో చికిత్స 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 08, 2023
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) గురువారం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో జారి పడిపోవడంతో ఆయనను సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు యశోద వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. అందుకు శస్త్ర చికిత్స నిర్వహించాలని వైద్యులు భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక దీని పై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.

Details 

ప్రగతి భవన్‌ విడిచిపెట్టి నేరుగా ఫామ్‌హౌస్‌

తెలంగాణలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) హ్యాట్రిక్ సాధించాలని ఆశలు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. 119 నియోజకవర్గాలు ఉన్న తెలంగాణాలో కాంగ్రెస్ 64 స్థానాలు గెలుచుకోగా,బీఆర్‌ఎస్‌కు 39 సీట్లు వచ్చాయి. ఎన్నికలలో ఓటమి అనంతరం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ విడిచిపెట్టి నేరుగా ఫామ్‌హౌస్‌ చేరుకున్నారు. ఆరోజు నుండి అక్కడే ఉంటున్నారు. గురువారం నాడు ఎర్రవల్లి లోని కేసీఆర్ నివాసం జన సందోహంతో నిండిపోయింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు, మేధావులు, కవులు, కళాకారులు, మహిళలు, యువకులు.. కేసీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు.