LOADING...
Telangana: తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు

Telangana: తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2026
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. దూర ప్రాంతాల్లో నివసించే రోగులు చికిత్స కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో 'హబ్ అండ్ స్పోక్' విధానంలో నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు ప్రధాన కేంద్రాలుగా పనిచేస్తూ, ఇతర కేంద్రాలకు సాంకేతిక సహకారం అందించనున్నాయి.

వివరాలు 

అందుబాటులోకి 416 పడకలు

కొత్త కేంద్రాలతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న 67 డయాలసిస్ కేంద్రాల్లో అదనంగా 155 యంత్రాలను ఏర్పాటు చేసి పడకల సంఖ్యను పెంచనున్నారు. ప్రతి 25 కిలోమీటర్ల పరిధిలో ఒక రక్త శుద్ధి కేంద్రం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ముఖ్యంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి ఏజెన్సీ,దూర ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్యలతో మొత్తం 416 పడకలు రోగులకు అందుబాటులోకి రానున్నాయి.

వివరాలు 

ఒక్కో కేంద్రంలో 5 నుంచి 10 యంత్రాల ఏర్పాటు

ఒక్కో కేంద్రంలో 5 నుంచి 10 యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే కిడ్నీ రోగులు చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన వైద్యం అందే అవకాశం ఉంటుంది. ఈ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన టెండర్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు,మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement