Telangana: ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై శుక్రవారం జీవో జారీ చేసింది. ఈ జీవోలో పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలనీ సూచించింది. గ్రామస్థాయిలో కమిటీకి సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి ఛైర్మన్గా ఉంటారు. మున్సిపాలిటీ స్థాయిలో కమిటీకి కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ ఛైర్మన్గా వ్యవహరిస్తారు. పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు ఆఫీసర్ ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్గా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. ఈ కమిటీలో ఇద్దరు మహిళా స్వయం సహాయక గ్రూపు (SHG) సభ్యులు,ముగ్గురు స్థానికులు సభ్యులుగా ఉంటారు.
ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు
ఈ కమిటీలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకు అవసరమైన అవగాహన కల్పిస్తాయి. శనివారం నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కమిటీల కోసం సభ్యుల పేర్లు పంపాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను కూడా ఆదేశించారు.