Telangana : ఐదు రాష్ట్రాల్లో తెలంగాణే టాప్.. రాష్ట్రంలో భారీగా 'కట్టలు పాములు' సీజ్
భారతదేశంలో మినీ సంగ్రామం జరుగుతోంది. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు సమయం దగ్గరపడింది. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో మొదటి విడత పోలింగ్ సైతం ముగిసింది. నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. నవంబర్ 7న మిజోరం, నవంబర్ 17న మధ్యప్రదేశ్, నవంబర్ 23న రాజస్థాన్ పోలింగ్ జరిగింది. మరోవైపు నవంబర్ 30న తెలంగాణలో పొలింగ్ రసవత్తరంగా సాగనుంది. డిసెంబర్ 3న అన్ని రాష్ట్రాలకు కలిపి లెక్కింపు జరగనుంది. అయితే ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల సంఘం లెక్కలో లేని డబ్బు,మద్యం,డ్రగ్స్,బంగారం లాంటి వస్తువులను సీజ్ చేసింది. దీంతో ఎన్నికల అధికారులు,పోలీసులు నోట్ల కట్టలను గుట్టులు గుట్టలుగా పట్టుకుంటుండం సంచలనంగా మారింది.
మద్యం, డ్రగ్స్, బంగారం ఎంతెంత పట్టుకున్నారో తెలుసా
తెలంగాణలో పోలింగ్' కోసం ఇంకో 3 రోజులే సమయం ఉంది. ఇదే సమయంలో రేపు సాయంత్రం 5 వరకు పోలింగ్'కు తెరపడనుంది. అత్యధికంగా ఒక్క తెలంగాణలోనే దాదాపుగా 659 కోట్లను సీజ్ చేసి ఔరా అనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 9న వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు తనిఖీల్లో భాగంగా దాదాపు రూ.659 కోట్లకు చేరింది. ఇందులో నగదు, బంగారం, వెండి, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న వాటిలో రూ.239 కోట్లకుపైగా నోట్ల కట్టలున్నాయి. అక్రమ మద్యం రూ.103 కోట్లు, మత్తు పదార్థాలు(drugs) విలువ రూ.35 కోట్లకుపైగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బంగారం,వెండి,వజ్రాల విలువ రూ.181కోట్లుగా నమోదైంది. ఇతరత్రా వస్తువుల విలువ రూ.79 కోట్లుగా తేల్చారు.
అర్థశాస్త్రంలో ఆసక్తికరమైన ఫార్ములా
ఈ మధ్య ఓ ఫార్ములా ఎన్నికలను ఆసక్తికరంగా మారుస్తోంది. ఏటా ఎన్నికలు జరిగితే ప్రజలకు మంచి జరుగుతుందని అంటున్నారు. ఫలితంగా ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు అందుతాయి. జన సమీకరణ కోసం రాజకీయ పార్టీలు భారీగా నల్లధనాన్ని ఖర్చు చేస్తాయి. దీంతో లక్షలాది మందికి డబ్బు అందుతుంది. పార్టీ జెండాల కొనుగోళ్లు, సభల ఏర్పాట్లు, ప్రచారాలకు భారీగా ఖర్చు చేస్తారు. దీంతో ధనం పెద్ద ఎత్తున ప్రజల చేతుల్లోకి వెళ్తుంది. ఈ మేరకు ఆర్థిక వ్యవస్థలో ధన ప్రవాహం (liquid Cash) పెరిగి ఎకానమీకి మంచి చేస్తుందని సదరు ఫార్ములా అంచనా వేస్తోంది. పోలింగ్ సమయం ముగింపునకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ నోట్ల కట్టలు ఊహించని రీతిలో పట్టుబడుతున్నాయి.
ప్రైవేట్ సంస్థలు,విద్యాసంస్థలు, ఐటీ సంస్థలు యజమానులపై సోదాలు
ఎమ్మెల్యే అభ్యర్థులు, వివిధ నాయకుల పేర్లు బయటకు రాకుండా కేవలం డబ్బు మాత్రం నియోజకవర్గ ప్రజలకు చేరేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఫ్లయింగ్ స్క్వాడ్స్ విస్తృత తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో భాగంగా ప్రైవేట్ సంస్థలు,విద్యాసంస్థలు, ఐటీ సంస్థలు యజమానులపై పోలీసులు, ఎన్నికల అధికారులు సోదాలు చేస్తున్నారు. తాజాగా బాయినాబాద్'లో పట్టుబడిన 7 కోట్ల 50 లక్షల రూపాయలు శ్రీనిధి విద్యాసంస్థకు చెందిన చైర్మన్గా పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి బొటానికల్ పార్క్ నుంచి చిరాక్ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్తున్న కారు నుంచి పోలీసులు రూ. 5 కోట్లు పట్టుకున్నారు. ఓ వ్యాపారవేత్తకు చెందిన నగదుగా దీన్ని గుర్తించారు. నాచారంలో కోటి 20 లక్షలు, అజీజ్ నగర్లో 7.4 కోట్ల నగదు సీజ్ అయ్యింది.
భారీగా దొరికిన బంగారం, నగదు సీజ్
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో ధనం దొరికింది.ఐదు రాష్ట్రాల్లో కలిపి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ. 1760 కోట్ల విలువైన డ్రగ్స్,నగదు, బంగారం,వెండిని ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుందని అధికారులు తెలిపారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఏడురెట్లు అధికంగా సీజ్ అయ్యాయి.గతంలో కేవలం రూ. 239.15 కోట్లు స్వాధీనం కాగా, ఈసారి ఒక్క తెలంగాణలోనే 225.25 కోట్ల నగదు సీజ్ కావడం గమనార్హం. తెలంగాణలో రూ.225.25 కోట్ల నగదు కలిపి మొత్తం రూ.659 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రచారానికి రేపు సాయంత్రం 5 గంటల వరకు గడువుంది. మరోవైపు 30న పోలింగ్ వరకు ఈ గణాంకాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.