TG News: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు,కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 52,43,023మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. వీరిలో 25,62,369 మంది పురుషులు, 26,80,014 మంది మహిళలు,అలాగే 640 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషంగా నిలుస్తోంది. కార్పొరేషన్లలో చూస్తే నిజామాబాద్ కార్పొరేషన్లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు ఉండగా, కొత్తగూడెం కార్పొరేషన్లో అత్యల్పంగా 1,34,775 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీల స్థాయిలో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 1,43,655 మంది ఓటర్లతో అగ్రస్థానం దక్కగా, అమరచింత మున్సిపాలిటీలో కేవలం 9,147 మంది ఓటర్లు మాత్రమే నమోదయ్యారు.
వివరాలు
రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తైన అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర పురపాలక శాఖ సన్నాహాలను వేగవంతం చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తైన అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జనాభాను ఆధారంగా చేసుకొని వార్డులు, డివిజన్లు, అలాగే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఎన్నికల మొత్తం ప్రక్రియలో రిజర్వేషన్లు కీలకమైన అంశం కావడంతో, అధికారులు వీటిని సమయానికి పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల ఎన్నికలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం.