Telangana SSC Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల..పెరిగిన ఉత్తీర్ణత శాతం.. బాలికలే హవా
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను ఎన్సీఈఆర్టీ ప్రాంగణంలోని గోదావరి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యా శాఖ కార్యదర్శి యోగిత రాణా కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 95.15గా నమోదైనట్లు యోగిత రాణా తెలిపారు. గత ఏడాది 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, ఈసారి ఆ శాతం 2.37 పెరిగింది. ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే ముందంజలో నిలిచారు.
వివరాలు
ఫలితాలను సులభంగా తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హాల్టికెట్ నంబరు నమోదు చేసి ఫలితాలను వెంటనే చూడవచ్చు. ఈసారి ఫలితాల్లో మార్పులు చేసి, కేవలం గ్రేడ్లతో పాటు ప్రతి అంశానికి సంబంధించిన మార్కులను కూడా చూపించేలా చేశారు. దీని వల్ల విద్యార్థులు తమ ప్రదర్శనను మరింత స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం కలిగింది. అదనంగా తొలిసారి వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు 80969 58096 నంబర్కు "హాయ్" అని సందేశం పంపితే ఫలితాలను పొందవచ్చు. డిజిటల్ విధానాల ద్వారా ఫలితాలను అందించడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు మరింత సౌలభ్యం కలిగిందని అధికారులు తెలిపారు.