Telangana: తెలంగాణలో 100కిపైగా కుక్కలకు విష ప్రయోగం.. ఎఫ్ఐఆర్లు నమోదు,విచారణ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో వీధి కుక్కలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో సుమారు 100 వరకు వీధి కుక్కలను చంపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, మరో ఘటనలో 50కి పైగా కుక్కలను అక్రమంగా పట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ పరిణామాలపై యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఆ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం,ఈ ఘటనలు నాగర్కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా తుమ్మనపల్లి గ్రామ పరిధిలో దాదాపు 100 వీధి కుక్కలను హతమార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యలు గ్రామ సర్పంచ్ ఆదేశాలతోనే జరిగాయని సమాచారం.
వివరాలు
సిద్దిపేట, నాగర్కర్నూల్ ఘటనలపై కేసులు నమోదు, ఎన్జీవోల ఆగ్రహం
మరో ఘటనలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామం నుంచి సుమారు 50 వీధి కుక్కలను పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించినట్లు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనలపై స్పందించిన ఎన్జీవో ప్రతినిధులు, జంతు హక్కుల చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ఈ చర్యలు చేపట్టారని ఆరోపించారు. జంతువులపై క్రూరత్వం నివారణ చట్టానికి విరుద్ధంగా వీధి కుక్కల హత్యలు, అక్రమ తరలింపులు జరిగాయని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ముధావత్ ప్రీతి ఫిర్యాదు చేయగా చారపాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు వెల్లడైంది. అలాగే మరో ఫిర్యాదు భూమ్పల్లి పోలీస్ స్టేషన్లో దాఖలైనట్లు సమాచారం.
వివరాలు
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్జీవోల డిమాండ్
ఈ కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. వీధి కుక్కల హత్యలు,అక్రమ తరలింపులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్జీవోలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జంతు హక్కుల అంశంపై విస్తృత చర్చకు దారితీయగా, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని తగిన చర్యలు చేపట్టాలని పలు వర్గాలు కోరుతున్నాయి.