NIA: ఎన్ఐఏ కస్టడీలోకి ఉగ్రవాద సానుభూతిపరులు.. ఐదు రోజుల పాటు విచారణ
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల అరెస్టయిన ఉగ్రవాద సానుభూతిపరులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతి మేరకు నిందితులను ఐదు రోజుల పాటు విచారించేందుకు ఎన్ఐఏ ప్రత్యేక కస్టడీ పొందింది. ఎన్ఐఏ అధికారులు జాంపేట మహిళా పోలీస్ స్టేషన్లో నిందితులను విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మార్చి నెలలో విజయవాడలో ముగ్గురు నిందితులను కొత్తపేట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, బిహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో మరో 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
విస్తృతంగా విచారణ చేపట్టిన అధికారులు
దర్యాప్తులో భాగంగా అరెస్టయిన వారంతా ఐఎస్ఐఎస్, అల్ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల భావజాలానికి ఆకర్షితులైనట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుల సోషల్ మీడియా ఖాతాలు, ఫోన్ కాల్ డేటా రికార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తూ ఎన్ఐఏ అధికారులు విస్తృతంగా విచారణ నిర్వహిస్తున్నారు. అలాగే దేశంలో పేలుళ్లకు సంబంధించిన ఏవైనా కుట్రలు పన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేసిన ఎన్ఐఏ అధికారులు, నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.