Telangana: నేటి నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ షురూ.. 37 హెల్ప్లైన్ కేంద్రాల ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి సంబంధించిన తొలి విడత కౌన్సెలింగ్ కోసం విద్యార్థులు జూన్ 19 నుంచి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకే కౌన్సెలింగ్లో పాల్గొని సీట్ల కోసం పోటీపడే అవకాశం ఉంటుంది. ఎప్సెట్ ప్రవేశాల కన్వీనర్,సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 22 నుంచి అభ్యర్థుల విద్యార్హతలు,పదో తరగతి,ఇంటర్మీడియట్ ధ్రువపత్రాలు,కుల,ఆదాయ ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియ కోసం రాష్ట్రవ్యాప్తంగా 37 హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వివరాలు
ఎప్సెట్ కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్
ఈ ఏడాది కొత్తగా శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని హుస్నాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలో కూడా హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తైన అనంతరం విద్యార్థులు జూన్ 25 నుంచి తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకుంటూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. మాక్ కౌన్సెలింగ్ తర్వాత అవసరమైతే ఆప్షన్లలో మార్పులు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. జూన్ 19 నుంచి 28 వరకు: ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ జూన్ 22 నుంచి 29 వరకు: ధ్రువపత్రాల పరిశీలన జూన్ 25 నుంచి జులై 1 వరకు: వెబ్ ఆప్షన్ల నమోదు జులై 4లోపు: మాక్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు
వివరాలు
సీట్లపై ఈ నెల 24న స్పష్టత
జులై 5 నుంచి 7 వరకు: అవసరమైతే వెబ్ ఆప్షన్లలో మార్పులు.. లేకపోతే మాక్ కౌన్సెలింగ్లో ఇచ్చిన ఆప్షన్లే ఫైనల్ జులై 10లోపు: తొలి విడత సీట్ల కేటాయింపు ఈసారి ఎప్సెట్ ఇంజినీరింగ్ పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన 1,44,704 మంది విద్యార్థులు కౌన్సెలింగ్కు అర్హత సాధించారు. సాధారణంగా ప్రతి ఏడాది 90 వేల నుంచి 95 వేల మంది వరకు కౌన్సెలింగ్కు హాజరవుతుండగా, దాదాపు 80 వేల మంది సీట్లు పొందుతున్నారు. గత ఏడాది కన్వీనర్ కోటా కింద సుమారు 92 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది సీట్ల సంఖ్యతో పాటు కళాశాలల వారీగా పూర్తి వివరాలు జూన్ 24 నాటికి వెల్లడయ్యే అవకాశం ఉంది.
వివరాలు
ఫీజు రీయింబర్స్మెంట్కు కీలక నిబంధనలు
కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50లక్షల లోపు ఉన్న విద్యార్థులకే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పించనుంది. ఇందుకోసం తహసీల్దారు జారీ చేసిన తాజా ఆదాయ ధ్రువపత్రాన్ని ధ్రువపత్రాల పరిశీలన సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధన గ్రామీణ,పట్టణ,నగర ప్రాంతాల విద్యార్థులందరికీ ఒకే విధంగా వర్తిస్తుంది. అయితే ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు ఎంత ఉన్నప్పటికీ ప్రభుత్వం పూర్తి మొత్తాన్ని ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో చెల్లించనుంది. అలాగే రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎప్సెట్లో ర్యాంకు సాధించిన విద్యార్థులకు కూడా పూర్తి బోధనా రుసుమును ప్రభుత్వం భరిస్తుంది. అదేవిధంగా ఎప్సెట్లో 10వేలలోపు ర్యాంకు సాధించిన అభ్యర్థులకు సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించనుంది.