
Group-1 Results: తెలంగాణ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల.. టాప్-10 ర్యాంకర్లు వీరే..
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మొత్తం 562 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం అర్ధరాత్రి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రకటించింది. అభ్యర్థులు పొందిన ప్రధాన పరీక్ష మార్కుల ఆధారంగా వచ్చిన మెరిట్, వారు ఇచ్చిన పోస్టుల ప్రాధాన్య క్రమం, అలాగే రిజర్వేషన్, రోస్టర్ విధానం ప్రకారం తుది ఎంపికలు పూర్తిచేశామని కమిషన్ తెలిపింది. మొత్తం 563 పోస్టులలో 562 పోస్టులు భర్తీ కాగా, ఒక పోస్టును న్యాయవివాదం కారణంగా విత్హెల్డ్లో ఉంచినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. ఈ ఫలితాల్లో టాప్-10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఎక్కువగా ఆర్డీవో (RDO) పోస్టులు ఎంపిక చేసుకున్నారని వెల్లడించారు.
వివరాలు
హైకోర్టు తీర్పు తర్వాత అర్ధరాత్రి వరకు కసరత్తు
ఆ టాప్-10 ర్యాంకులను వరుసగా లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణసాయి సాధించారని తెలిపారు. అయితే ఈ తుది ఎంపికలు హైకోర్టు తుదితీర్పుకు లోబడి ఉంటాయని కూడా స్పష్టం చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు సీజే ధర్మాసనం నిలిపివేయడంతో కమిషన్కు ఫలితాల ప్రకటనకు మార్గం సుగమమైంది. ఆ తీర్పు వెలువడిన వెంటనే బోర్డు చైర్మన్ బుర్రా వెంకటేశం నేతృత్వంలో సమావేశమై,అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి తుది ఎంపిక జాబితాను విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం అందించినట్లు నిర్ధారణ అయితే వారి నియామకాలు వెంటనే రద్దు చేయబడతాయి.
వివరాలు
డాక్టరే రాష్ట్ర టాపర్
అదేవిధంగా టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది. ఈసారి మల్టీజోన్-1లో 258 పోస్టులు,మల్టీజోన్-2లో 304పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షలు మొత్తం 900మార్కులకు జరగగా,550మార్కులతో మల్టీజోన్-2 కేటగిరీలో హైదరాబాద్ ఏఎస్రావు నగర్కు చెందిన లక్ష్మీదీపిక రాష్ట్ర టాపర్గా నిలిచారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వైద్య విద్య పూర్తి చేసిన ఆమె,పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి తుది ఎంపికలో ఆర్డీవో పోస్టు పొందారు. అలాగే, మల్టీజోన్-1లో హనుమకొండ జిల్లా అభ్యర్థి జిన్నా తేజస్విని 532మార్కులతో అగ్రస్థానం సాధించి ఆర్డీవో పోస్టుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్నారు.ఇక నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు సాధించి ఆర్డీవో పోస్టు పొందారు.
వివరాలు
ఏప్రిల్లోనే ధ్రువీకరణ పత్రాల పరిశీలన
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రూప్-1 నియామకాలు జరగడం ఇదే మొదటిసారి అని కమిషన్ పేర్కొంది. జనరల్ మెరిట్ ర్యాంక్ జాబితాలో తొలి 10 ర్యాంకుల్లో 6 మంది మహిళలు ఉండటం విశేషం. అదేవిధంగా టాప్-50లో 25 మంది, టాప్-100లో 41 మంది మహిళలు చోటు దక్కించుకున్నారు. ప్రధాన పరీక్షల్లో (ఇంగ్లీష్ మినహా) 500 మార్కులకుపైగా సాధించిన అభ్యర్థులు 52 మంది ఉన్నారు. మరికొక ముఖ్యాంశం ఏమిటంటే, టాప్-3 ర్యాంకర్తో పాటు టాప్-100లో ఐదుగురు తెలంగాణ స్థానికేతరులు కూడా ప్రతిభ కనబరిచారు. అభ్యర్థుల మార్కులను పరిగణనలోకి తీసుకుని జనరల్ ర్యాంక్ లిస్ట్ (GRL)ను టీజీపీఎస్సీ ప్రకటించింది.
వివరాలు
ఆప్షన్ల ఆధారంగా తుది ఎంపికలు
GRL ఆధారంగా, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ ప్రకారం ఎంపికలు జరిగేలా ఏప్రిల్ 16 నుంచి 22 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టారు. పరిశీలన సమయంలో అభ్యర్థుల నుంచి మరోసారి ఆప్షన్లు సేకరించి, ఆ ఆప్షన్ల ఆధారంగా తుది ఎంపికలు పూర్తి చేశారు. హైకోర్టు తాజా ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఈ ఫలితాలు ప్రకటించారు.
వివరాలు
గ్రూప్-1 నోటిఫికేషన్,పరీక్షలు,వివాదాలు
గ్రూప్-1లోని 563 పోస్టులకు 2024 ఫిబ్రవరిలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం 2024 అక్టోబరు 21 నుంచి 27 వరకు ప్రధాన పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు హాజరైన 21,085 మంది అభ్యర్థుల మార్కులు మార్చి 30న ప్రకటించారు. కానీ, వివిధ కారణాలతో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ పిటిషన్లపై విచారణ అనంతరం జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని, లేకపోతే మళ్లీ పరీక్షలు నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుపై కమిషన్ అప్పీలు చేయగా, హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును నిలిపివేసింది. దాంతో కమిషన్ తుది ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది.