Konaseema : ఆకాశం నుంచి గోదావరి అందాలు.. సంక్రాంతికి హెలికాప్టర్ రైడ్ అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ఈ సంక్రాంతి పండుగను మరింత ప్రత్యేకంగా, చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకునే వారికి అరుదైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. గోదావరి జిల్లాల అద్భుతమైన ప్రకృతి అందాలను ఆకాశం నుంచి వీక్షించేలా హైదరాబాద్కు చెందిన 'విహాగ్' సంస్థ నరసాపురంలో హెలికాప్టర్ రైడ్ను ఏర్పాటు చేస్తోంది. పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక గగన విహారం అందుబాటులో ఉండనుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కాలేజీ గ్రౌండ్స్ నుంచి హెలికాప్టర్ రైడ్ ప్రారంభమవుతుంది. ఈ ప్రయాణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది ఆలయం, విశాలమైన సాగర తీరం, లైట్ హౌస్, గోదావరి పాయలు కలిసే అన్నచెల్లెళ్ల గట్టు వంటి ప్రముఖ ప్రాంతాలను ఆకాశం నుంచి వీక్షించే అవకాశం ఉంటుంది.
Details
టికెట్ ధర రూ.5వేలు
అంతేకాదు, కోనసీమ జిల్లాలోని పచ్చని కొబ్బరి తోటల సహజ సౌందర్యం కూడా ఈ గగన విహారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఒక్కో ప్రయాణికుడికి టికెట్ ధరను రూ.5,000గా నిర్ణయించారు. సుమారు 25 నిమిషాల పాటు సాగే ఈ హెలికాప్టర్ ప్రయాణంలో దాదాపు 25 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాలను చూపించనున్నారు. పండుగ సందడికి మరింత రంగులు అద్దేలా ఈ హెలికాప్టర్ రైడ్ నరసాపురంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు.