LOADING...
India's BrahMos Missile: చైనాను ఎదుర్కొనేందుకు.. భారత్ బ్రహ్మోస్ క్షిపణికి కోసం ఆసియా దేశాల క్యూ..
చైనాను ఎదుర్కొనేందుకు.. భారత్ బ్రహ్మోస్ క్షిపణికి కోసం ఆసియా దేశాల క్యూ..

India's BrahMos Missile: చైనాను ఎదుర్కొనేందుకు.. భారత్ బ్రహ్మోస్ క్షిపణికి కోసం ఆసియా దేశాల క్యూ..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2026
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా గుర్తింపు పొందిన భారత్.. ఇప్పుడు ఆయుధాల ఎగుమతుల్లోనూ వేగంగా దూసుకెళ్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు రూ.38,424 కోట్లకు చేరుకుని కొత్త రికార్డు సృష్టించాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.14,802 కోట్ల (62.66 శాతం) భారీ వృద్ధి. ఈ వృద్ధికి ప్రధాన కారణాల్లో ఒకటి భారత్ తయారు చేసిన అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇప్పటికే ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్‌ను విక్రయించిన భారత్, తాజాగా వియత్నాంకు కూడా ఎగుమతి ఒప్పందం కుదుర్చుకుంది. ఇండోనేషియాతో కూడా ఇదే తరహా ఒప్పందం తుది దశకు చేరుకుంది.

వివరాలు 

బ్రహ్మోస్ ప్రత్యేకత ఏంటి?

భారత్‌ రక్షణ పరిశోధన సంస్థ (DRDO),రష్యాకు చెందిన NPO Mashinostroyeniya సంయుక్త భాగస్వామ్య సంస్థ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఈ క్షిపణిని తయారు చేస్తోంది. రెండు దశల ఇంజిన్ వ్యవస్థతో పనిచేసే ఈ క్షిపణి శబ్ద వేగానికి మూడింతల వరకు ప్రయాణించగలదు. సబ్‌మరైన్లు,యుద్ధనౌకలు,యుద్ధవిమానాలు,భూమి ఆధారిత లాంచర్ల నుంచి దీనిని ప్రయోగించవచ్చు. సుమారు 300కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. 200 నుంచి 300 కిలోల వరకు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. బ్రహ్మోస్‌కు రాడార్‌లో కనిపించే అవకాశం చాలా తక్కువ. అందువల్ల శత్రువులు దీనిని ముందుగానే గుర్తించడం కష్టమవుతుంది. అంతేకాకుండా లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. 'ఫైర్ అండ్ ఫర్గెట్' విధానంలో పనిచేసే ఈ క్షిపణి ప్రయోగించిన తర్వాత ప్రత్యేక నియంత్రణ అవసరం ఉండదు.

వివరాలు 

ఆపరేషన్ సిందూర్‌లో సత్తా

గత ఏడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణుల సామర్థ్యం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పాకిస్థాన్‌లోని నూర్ ఖాన్, రహిమ్ యార్ ఖాన్ వైమానిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఈ క్షిపణులు కీలక పాత్ర పోషించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

Advertisement

వివరాలు 

ఫిలిప్పీన్స్ నుంచి వియత్నాం వరకు..

బ్రహ్మోస్‌కు తొలి విదేశీ కస్టమర్‌గా ఫిలిప్పీన్స్ నిలిచింది. సుమారు 375 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కింద మూడు తీర రక్షణ క్షిపణి వ్యవస్థలను భారత్ సరఫరా చేస్తోంది. మొదటి బ్యాటరీని 2024 ఏప్రిల్‌లో అందజేయగా, మరో బ్యాటరీ గత ఏడాది చేరింది. తాజాగా వియత్నాంతో సుమారు రూ.5,800 కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఇందులో తీర రక్షణ క్షిపణి బ్యాటరీలు, క్షిపణులు, శిక్షణ, లాజిస్టిక్ మద్దతు ఉన్నాయి. భవిష్యత్తులో వియత్నాం గగనతలం నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ వెర్షన్‌ను కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇండోనేషియా కూడా బ్రహ్మోస్ కొనుగోలుకు అంగీకరించింది. ఈ ఒప్పందం విలువ సుమారు 450 మిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

Advertisement

వివరాలు 

మరిన్ని దేశాల ఆసక్తి

మలేసియా, థాయ్‌లాండ్‌తో పాటు పశ్చిమ ఆసియాలోని సౌదీ అరేబియా, ఖతర్, ఒమన్, ఈజిప్ట్ దేశాలు కూడా బ్రహ్మోస్‌పై ఆసక్తి చూపుతున్నాయి. లాటిన్ అమెరికాలో బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనిజులా వంటి దేశాలు కూడా ఈ క్షిపణి వ్యవస్థను పరిశీలిస్తున్నాయి.

వివరాలు 

బ్రహ్మోస్ వెనుక 'చైనా ఫ్యాక్టర్'

దక్షిణాసియా దేశాలు బ్రహ్మోస్‌పై ఆసక్తి చూపడానికి కేవలం దాని సాంకేతిక సామర్థ్యాలే కారణం కాదు. చైనా పెరుగుతున్న నౌకాదళ శక్తి, సముద్ర విస్తరణ విధానాలు కూడా ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలకు చైనాతో సముద్ర సరిహద్దు వివాదాలు ఉన్నాయి. చైనా నౌకాదళానికి సమానంగా భారీ వ్యయం చేయలేని ఈ దేశాలు, తీర ప్రాంతాల్లో బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలను మోహరించడం ద్వారా తమ రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవచ్చని వ్యూహాత్మక నిపుణులు భావిస్తున్నారు.

వివరాలు 

బ్రహ్మోస్ వెనుక 'చైనా ఫ్యాక్టర్'

భారత సైన్యంలో మాజీ అధికారి మేజర్ గౌరవ్ ఆర్య అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం బ్రహ్మోస్ కొనుగోలు చేస్తున్న దేశాల్లో చాలా వరకు చైనాతో భూభాగం లేదా సముద్ర సరిహద్దు వివాదాలు ఉన్నవే. రక్షణ రంగ నిపుణుల అంచనా ప్రకారం, బ్రహ్మోస్ ఎగుమతులు భారత ఆయుధ మార్కెట్‌కు కొత్త అవకాశాలను తెరవడమే కాకుండా, ఆసియా ప్రాంతంలో చైనా ప్రభావానికి సమతూకంగా నిలిచే వ్యూహాత్మక సాధనంగా మారవచ్చు.

Advertisement