హైదరాబాద్లో అమెరికా దిగ్గజ కంపెనీ 'మెడ్ట్రానిక్' రూ.3వేల కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. తాజాగా, మెడికల్ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న అమెరికాకు చెందిన మెడ్ట్రానిక్ కంపెనీ రాష్ట్రంలో ఆర్ అండ్ డీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్లో రూ.3000 కోట్లతో వైద్య పరికరాల కోసం మెడ్ట్రానిక్ ఇంజనీరింగ్ & ఇన్నోవేషన్ సెంటర్ (ఎంఈఐసీ)ని ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఎంఈఐసీ అనేది అమెరికాలో వెలుపల ఆ కంపెనీకి అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం కావడం గమనార్హం.
మెడ్ట్రానిక్తో ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించిన కేటీఆర్
గ్లోబల్ ఆర్ అండ్ డీ లీడ్ ఇన్నోవేషన్, గ్రోత్ స్ట్రాటజీలో భాగంగానే హైదరాబాద్లో మెడ్ట్రానిక్ పెట్టుబడులు పెడుతోంది. హెల్త్కేర్ టెక్నాలజీ రీసెర్చ్, ఇన్నోవేషన్ల కోసం హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా ఉంచడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మెడ్ట్రానిక్ ఏర్పాటు మద్దతుగా నిలువనుంది. మెడ్ట్రానిక్ చీఫ్ మైక్ మారినారో, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & సర్జికల్ ప్రెసిడెంట్, మణి ప్రకాష్, ఎంటర్ప్రైజ్ ఆర్ అండ్ డి వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ & ఎంఈఐసీ సైట్ లీడర్ దివ్య ప్రకాష్ జోషితో న్యూయార్క్లో ఐటీ మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. అనంతరం మెడ్ట్రానిక్ పెట్టుబడులను అధికారికంగా ప్రకటించారు.