Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల్లో మొదటి వందే భారత్ స్లీపర్ రైలుకు రంగం సిద్ధం.. ఏ మార్గంలో అంటే..
ఈ వార్తాకథనం ఏంటి
భారత రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక ఆధునిక సేవలను అందుబాటులోకి తెస్తూ ముందుకు సాగుతోంది. హైస్పీడ్ రైళ్ల ప్రవేశపెట్టడంలో భాగంగా వందేభారత్ ఎక్స్ప్రెస్లు ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి వందే భారత్ స్లీపర్ రైళ్లపై కేంద్రీకృతమైంది. మొదట రిలీజ్ కావలసిన ఈ స్లీపర్ రైళ్లు కొన్ని కారణాల వల్ల ఆలస్యం కాగా, డిసెంబర్లో తొలి వందేభారత్ స్లీపర్ రైలును ట్రాక్పైకి తీసుకురావడానికి కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ముఖ్యంగా ఈ మొదటి స్లీపర్ రైలును తెలుగు రాష్ట్రాల్లో నడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే సమాచారం వెలువడుతోంది.
వివరాలు
విజయవాడ మీదుగా..
మొదటి వందేభారత్ స్లీపర్ రైలును విజయవాడ డివిజన్ మీదుగా నడపడానికి రైల్వే అధికారులు ప్రాథమిక వ్యూహాలను సిద్ధం చేశారని తెలుస్తోంది. విజయవాడ-సికింద్రాబాద్, విజయవాడ-విశాఖపట్నం వంటి అధిక రద్దీ రూట్లపై ఈ రైలును నడపడమే లక్ష్యంగా కేంద్రం కసరత్తు చేస్తోంది. అవసరమైన అనుమతులు అందినట్లైతే వచ్చే నెల డిసెంబర్లోనే ఈ సేవను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏపీ ప్రాంతంలో ఈ రైలు ఆపరేషన్ విషయంలో త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం.
వివరాలు
వందేభారత్పై మంచి స్పందన:
ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. ఈ స్పందనకు అనుగుణంగా ఇప్పుడు స్లీపర్ వెర్షన్ను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ వేగం పెంచింది. ఈ స్లీపర్ రైళ్లు ఇప్పటికే ట్రయల్స్ దశలో విజయవంతమయ్యాయి. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోచ్లను ఆధునికంగా డిజైన్ చేశారు. ట్రయల్స్ తర్వాత లోపలి సీట్లలో, ఇంటీరియర్లో కొంత మార్పులు చేసి, మరింత అనుకూలంగా మార్చినట్లు అధికారులు తెలిపారు. వివిధ సాంకేతిక సదుపాయాలను కూడా రైల్వే అందులో అమర్చింది.
వివరాలు
కోచ్లు - బెర్తుల వివరాలు
ఈ స్లీపర్ రైలులో ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ టూ టియర్,ఏసీ త్రీ టియర్ కోచ్లు ఉంటాయి. మొత్తం 823 బెర్తులు ఉన్నాయి. వాటిలో: ఏసీ త్రీ టియర్- 611,ఏసీ టూ టియర్- 188,ఫస్ట్ క్లాస్ - 24 ఫస్ట్ ఏసీ కోచ్లో హాట్ వాటర్ షవర్, ఆధునిక ఇంటీరియర్,మరింత మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దీర్ఘ ప్రయాణాల్లో ప్రయాణికులు సౌకర్యవంతంగా నిద్రించేందుకు ప్రత్యేక డిజైన్ను ఉపయోగించారు. ఈ స్లిపర్ రైళ్లలో విమానం లాంటి సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు గతంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. విమాన కేబిన్లను పోలిన ఇంటీరియర్,వై-ఫై, USB ఛార్జింగ్ పోర్టులు,వ్యక్తిగత రీడింగ్ లైట్స్,CCTV కెమెరాలు,డిస్ప్లే ప్యానెల్లు వంటి అనేక అధునిక సదుపాయాలు అందులో అమర్చబడ్డాయి.