SLBC Tunnel: టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కోసం కొనసాగుస్తున్న గాలింపు.. కుటుంబ సభ్యుల్లో పెరుగుతున్న ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదం ఉత్కంఠను పెంచుతోంది.
ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా, చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. శిథిలాల మధ్య చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
ఘటన స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
అయితే అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా, కార్మికుల క్షేమంపై ఆశలు తగ్గుతున్నాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజినీర్లు, ఆరుగురు కూలీలు మట్టి, బురదలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని సమాచారం.
Details
రంగంలోకి భారత సైన్యం, రెస్క్యూ టీమ్
ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టి, ఇప్పటికే NDRF బృందాన్ని సహాయక చర్యల కోసం రంగంలోకి దించింది.
అంతేకాకుండా భారత సైన్యం, రెస్క్యూ టీమ్ సాయం కూడా కోరినట్లు మంత్రులు వెల్లడించారు.
సహాయక బృందాలు టన్నెల్లోని నీటిని బయటకు పంపేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. డీ-వాటరింగ్ కోసం ప్రత్యేక బృందాలు టన్నెల్లో ప్రవేశించాయి.
12 కిలోమీటర్ల తరువాత బురద, నీరు అధికంగా ఉండటంతో NDRF బృందం వెనుదిరిగింది.
విద్యుత్ పునరుద్ధరణ, ఆక్సిజన్ పైపుల ఏర్పాటు, నీటి తొలగింపు కోసం ఇంజినీర్లు చర్యలు తీసుకుంటున్నారు.
టన్నెల్ బోరింగ్ మిషన్తో సహాయక చర్యలు ప్రారంభించగా, లోపల 8 మీటర్ల మేరకు మట్టి, నీరు చేరిందని అధికారులు తెలిపారు.
Details
ముమ్మరంగా సహాయక చర్యలు
అధికారులు శ్రమిస్తున్నా ఇప్పటివరకు లోపల చిక్కుకున్న కార్మికుల గురించి స్పష్టమైన సమాచారం లేదు.
సహాయక చర్యలు కొనసాగుతున్నా, లోపల భారీగా నీరు, బురద ఉండటంతో రక్షణ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
ప్రభుత్వం, విపత్తు నిర్వహణ విభాగం, రక్షణ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నాయి.
త్వరలోనే కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.