
Operation Sindoor: పాక్తో యుద్ధం మే10తో ముగియలేదన్న ఆర్మీ చీఫ్
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక విషయాలను వెల్లడించారు. దిల్లీలో విడుదలైన 'ఆపరేషన్ సిందూర్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్థాన్' పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ద్వివేది మాట్లాడుతూ 'మే 10న పాకిస్థాన్తో యుద్ధం ముగిసిందని మీరు అనుకుంటారు. కానీ అది అలా ముగియలేదు. అనేక వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి రావడంతో ఆపరేషన్ అనుకున్నదానికంటే ఎక్కువ రోజులు కొనసాగింది. ఆ వివరాలన్నింటినీ ఇక్కడ బహిరంగంగా చెప్పలేనని వ్యాఖ్యానించారు.
Details
సాయుధ దళాల సహకారమే విజయానికి కారణం
'పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ఇంకా సరిహద్దు ప్రాంతాల్లో చొరబాటు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆపరేషన్లో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారో అందరికీ తెలిసిందే. సాయుధ దళాల సహకారమే ఈ విజయానికి కారణమని అభినందించారు. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలపై స్పందిస్తూ-డ్రోన్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం హర్షణీయమని అన్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కేవలం పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని సాగింది. పీవోకే(POK)లోని కీలక ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు జరిపి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ చర్యలతో ఇరుదేశాల మధ్య కొన్ని రోజుల పాటు భీకర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.చివరికి పాకిస్థాన్ అభ్యర్థన మేరకు భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే.