
Operation Sindoor : సైనిక శౌర్యానికి ప్రతీకగా.. ఆపరేషన్ సిందూర్ లోగోను రూపొందించిన వీరులు వీరే!
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ప్రారంభించిన 'ఆపరేషన్ సిందూర్' పేరిట, మే 7వ తేదీన పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు చేసిన విషయం విదితమే.
ఈ ప్రత్యేక ఆపరేషన్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది.
ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో సైన్యం అపార విజయాన్ని సాధించింది.
ఈ మెరుపుదాడుల అనంతరం, భారత సైన్యం తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో 'ఆపరేషన్ సిందూర్' పేరుతో ప్రత్యేక లోగోతో కూడిన పోస్టర్ను అర్ధరాత్రి 1.51 గంటలకు ప్రచురించింది.
Details
దేశ చరిత్రలో 'ఆపరేషన్ సింధూర్' గర్వకారణం
మొత్తం 25 నిమిషాల పాటు కొనసాగిన ఈ మెరుపుదాడులకు సంబంధించిన విజయం, ఆత్మవిశ్వాసం, సైనికుల ధైర్యసాహసాల ప్రతిరూపంగా ఆ లోగో నిలిచింది.
ఈ నేపథ్యంలో, భారత సైన్యం వెలువరించే పత్రిక 'బాత్చిట్ (మాటామంతీ)' తాజా సంచికను ఆపరేషన్ సిందూర్కు అంకితమిస్తూ విడుదల చేశారు.
ఈ సంచికలో ఆపరేషన్ సిందూర్ లోగోను రూపొందించినవారు లెఫ్టినెంట్ కర్నల్ హర్ష్ గుప్తా హవల్దార్ సురీందర్ సింగ్ అని వివరించారు.
ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం తన శౌర్యాన్ని, వేగాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరోసారి చాటిచెప్పింది. 'ఆపరేషన్ సిందూర్' ఇప్పుడు దేశ సైనిక చరిత్రలో ఒక గర్వకారణమైన అధ్యాయంగా నిలిచింది.