Page Loader
CM Chandrababu: చివరి రోజు అదే కావొచ్చు.. సోషల్ మీడియా రౌడీలకు చంద్రబాబు వార్నింగ్!
చివరి రోజు అదే కావొచ్చు.. సోషల్ మీడియా రౌడీలకు చంద్రబాబు వార్నింగ్!

CM Chandrababu: చివరి రోజు అదే కావొచ్చు.. సోషల్ మీడియా రౌడీలకు చంద్రబాబు వార్నింగ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2025
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్‌ మీడియా దుర్వినియోగం చేసే వారిపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాల ప్రతినిధులతో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా విమర్శిస్తే అది నేరంగా పరిగణిస్తామన్నారు. తప్పు చేసే వారిపై చండశాసనుడిగా వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు. వైఎస్‌ భారతిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియా నేరస్థుల వేదికగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు గౌరవప్రదమైన జీవితం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Details

బీసీ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి 

బీసీ వర్గాల అభివృద్ధికి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. కులవృత్తులపై అవగాహన కల్పించేందుకు నక్కబోయిన కోటయ్య ఇంటిని సందర్శించిన సీఎం, ఆయన పశువుల పాకను పరిశీలించి, గేదెల ద్వారా ఆర్జించే ఆదాయంపై చర్చించారు. త్వరలో బీసీ సంరక్షణ చట్టాన్ని తీసుకువస్తామని, ఈ చట్టం మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో రూపుదిద్దుకుంటుందని తెలిపారు. బీసీలకు ఉద్యోగాల్లో 33 శాతం, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనని ఆయన గుర్తు చేశారు. జిల్లాల వారీగా బీసీ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. బీసీ విద్యార్థుల కోసం అమరావతిలో సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టీడీపీకి బీసీలు ఎప్పటి నుంచో వెన్నెముకగా ఉన్నారని పేర్కొన్నారు.

Details

పీ-4 ద్వారా అభివృద్ధి లక్ష్యం 

మోదీ, పవన్ కల్యాణ్‌తో కలిసి వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నామని, లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వివరించారు. "తల్లికి వందనం" కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. మే నుంచి రైతులకు విడతలవారీగా రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. పీ-4 (పంపిణీ, పునరుద్ధరణ, పునరావాసం, పరస్పర సహకారం) ప్రణాళికను ప్రారంభించామన్నారు. 10 మంది సంపన్నులు 20 మంది పేదలకు చేయూత ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. ఆగిరిపల్లిలో 206 పేద కుటుంబాలను గుర్తించామని, వారికి స్థలాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇచ్చిన తర్వాతే మళ్లీ ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు.