
Delhi Schools: దిల్లీ స్కూళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు..ఆంధ్ర స్కూల్కు బెదిరింపు సందేశం
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం అనేక పాఠశాలలకు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు హెచ్చరికలు పంపడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమాచారం అందిన వెంటనే దిల్లీ పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై వెంటనే సంఘటనా ప్రదేశాలకు చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. అధికారుల వివరాల ప్రకారం,ఉదయం 7:40 గంటల సమయంలో మాలవీయ నగర్లో ఉన్న ఎస్కేవీ పాఠశాలకు, ఆ తర్వాత కేవలం రెండు నిమిషాల వ్యవధిలో అంటే 7:42గంటలకు ప్రసాద్ నగర్లోని ఆంధ్ర స్కూల్కు బాంబు బెదిరింపుల ఈమెయిళ్లు అందాయి. పరిస్థితి సీరియస్గా ఉండడంతో పోలీసులు,బాంబు నిర్వీర్య దళాలు,డాగ్ స్క్వాడ్ బృందాలు వేగంగా అక్కడికి చేరుకుని పాఠశాల ప్రాంగణంలో శోధనలు నిర్వహించాయి.
వివరాలు
ఆన్లైన్ క్లాసులకే పరిమితమైన పాఠశాలలు
ముందుజాగ్రత్త చర్యగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఢిల్లీలో ఇలాంటి సంఘటనలు ఇది మొదటిసారి కావు. రెండు రోజుల క్రితమే ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)కి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు కూడా అధికారులు సమగ్రంగా తనిఖీలు జరిపి, అది బూటకపు బెదిరింపు అని తేల్చారు. అంతకుముందు గత నెలలో ఒకేసారి 50కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు రావడం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం రేపింది. ఆ సమయంలో జాగ్రత్త చర్యగా అనేక పాఠశాలలు ఆన్లైన్ క్లాసులకే పరిమితమయ్యాయి.
వివరాలు
వరుస ఘటనలతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన
ఈ వరుస బెదిరింపులు విద్యార్థులలోనే కాక, తల్లిదండ్రుల్లోనూ తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ఈమెయిళ్ల వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, భయాందోళనలకు గురికావద్దని అధికారులు సూచిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని వారు స్పష్టం చేశారు.