
Bogatha Waterfall: పర్యాటకులకు శుభవార్త.. నేటి నుంచి బొగత జలపాతం సందర్శనకు అనుమతి..
ఈ వార్తాకథనం ఏంటి
ములుగు జిల్లాలోని వాజేడు మండలానికి చెందిన చీకుపల్లి గ్రామ శివారులో ఉన్న ప్రసిద్ధ బొగత జలపాతం,ఈ మధ్య వర్షాలతో పరవళ్లు తొక్కుతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తూ, జలసవ్వడులతో మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య, అధికారుల అనుమతితో నేటి నుండి పర్యాటకులు బొగత జలపాతాన్ని సందర్శించవచ్చు. అటవీ శాఖ అధికారులు, పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని నియమ నిబంధనలతో సందర్శనకు అనుమతులు మంజూరు చేశారు.
వివరాలు
నీటి కొలనులోకి పర్యాటకుల అనుమతి నిరాకరణ
గత పదిహేను రోజులుగా ఎడతెరపిలేని వర్షాల కారణంగా బొగత జలపాతం నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పర్యాటకులను అటుగా అనుమతించలేదు. అయితే, నిన్నటి నుండి ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టడంతో అధికారులు సందర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఏ సమయంలోనైనా ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశం ఉండటంతో, జలపాతం కింద ఏర్పడిన నీటి కొలనులోకి ప్రవేశించడానికి మాత్రం పర్యాటకులకు అధికారులు అనుమతి ఇవ్వలేదు.