Rain Alert : బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. ఏపీలో మూడ్రోజులు జల్లులు కురిసే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వర్షాలు క్రమంగా తగ్గాయి. వరుసగా కురిసిన వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు ఇప్పుడు కొంత ఊరట పొందుతున్నారు. అయితే, వర్షాల తాలూకు ఇబ్బందులు తగ్గినప్పటికీ, రాబోయే రోజుల్లో చలికి సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అమరావతి వాతావరణ కేంద్రం తాజా నివేదిక ప్రకారం, నైరుతి బంగాళాఖాతం నుంచి కేరళ వరకు, శ్రీలంక-తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. అదేవిధంగా దిగువ ట్రోపోస్థాయిలో ఉత్తర-ఈశాన్య గాలులు వీస్తుండటంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Details
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమలో సోమవారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో వచ్చే రెండు రోజులు జల్లులు పడవచ్చని, దక్షిణ కోస్తా జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రివేళ వరకు కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదిలా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది.
Details
తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత
రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. నవంబర్ 10 తరువాత చలి తీవ్రత మరింత పెరుగుతుందని ఐఎండీ హెచ్చరించింది. ప్రత్యేకంగా తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాల తరువాత చలి విపరీతంగా పెరగనున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.