Loading...
Delhi Police: ఎన్‌ఎస్‌ఏ అధికారాలపై అపోహలు.. అసలు విషయం వెల్లడించిన ఢిల్లీ పోలీసులు
ఎన్‌ఎస్‌ఏ అధికారాలపై అపోహలు.. అసలు విషయం వెల్లడించిన ఢిల్లీ పోలీసులు

Delhi Police: ఎన్‌ఎస్‌ఏ అధికారాలపై అపోహలు.. అసలు విషయం వెల్లడించిన ఢిల్లీ పోలీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2026
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీజేపీ (Cockroach Janta Party-CJP) నిరసనలను అణిచివేసేందుకే ఢిల్లీ పోలీసులకు జాతీయ భద్రతా చట్టం (NSA) కింద నిర్బంధ అధికారాలు ఇచ్చారనే వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. ఇటీవల వెలువడిన ఉత్తర్వులు సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనని,వాటికి ప్రస్తుత నిరసనలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

వివరాలు 

అక్టోబర్ 18 వరకు ఉత్తర్వులు అమల్లో..

ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జాతీయ భద్రతా చట్టం-1980 ప్రకారం ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసే అధికారాలను మరో మూడు నెలల పాటు పొడిగించారు.

ఈ అనుమతి జూలై 19 నుంచి అక్టోబర్ 18, 2026 వరకు అమల్లో ఉంటుంది.

ఈ కాలంలో అవసరమైతే ఎన్‌ఎస్‌ఏ నిబంధనల ప్రకారం ముందస్తు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసే అధికారం కమిషనర్‌కు ఉంటుంది.

ప్రభుత్వం ఉత్తర్వులు ముందుగానే రద్దు చేయకపోతే ఈ ఉత్తర్వులు అక్టోబర్ 18 వరకు అమల్లో కొనసాగుతాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఢిల్లీ పోలీస్ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT

వివరాలు 

ఢిల్లీ పోలీసులు వివరణ

అయితే ఈ నిర్ణయం సీజేపీ నిరసనలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడంతో ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు.

ఎన్‌ఎస్‌ఏ అధికారాల పునరుద్ధరణ ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే సాధారణ పరిపాలనా చర్య మాత్రమేనని తెలిపారు.

ప్రస్తుత ఉత్తర్వులు జూలై 7, 2026న జారీ అయ్యాయని, అవి జూలై 19 నుంచి అక్టోబర్ 18 వరకు అమల్లో ఉండేలా నిర్ణయించారని పేర్కొన్నారు.

సీజేపీ నిరసనలు ఉధృతం కావడానికి ముందే ఈ ప్రక్రియ పూర్తయిందని, అందువల్ల ఈ రెండు అంశాలకు సంబంధం కల్పించడం సరైంది కాదని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమే

"సీజేపీ నిరసనలను అణిచివేయడానికే ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ఎన్‌ఎస్‌ఏ కింద నిర్బంధ అధికారాలు ఇచ్చారంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఎలాంటి అభ్యర్థన ప్రభుత్వం వద్దకు వెళ్లలేదు. ఇది సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమే. కొన్ని కథనాలు దీనిని తప్పుగా అర్థం చేసుకున్నాయి" అని ఢిల్లీ పోలీసులు గురువారం వెల్లడించారు.

వివరాలు 

సీజేపీ నిరసనలు ఉధృతం

ఇదిలా ఉండగా, జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న సీజేపీ నిరసనలు మరింత ఉధృతమయ్యాయి.

గురువారం రాత్రి పార్లమెంట్ మార్గ్‌లోని ది పార్క్ హోటల్ సమీపంలో నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

దీంతో సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

రహదారిపైకి వచ్చిన నిరసనకారులను చెదరగొట్టేందుకు ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.

మరోవైపు కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వివరాలు 

సీజేపీ నిరసనలు ఉధృతం

బోస్టన్ యూనివర్సిటీలో చదివిన అభిజీత్ దిప్కే ప్రారంభించిన కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మొదట సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్య ప్రచారంగా ప్రారంభమైంది.

అయితే అనంతరం దేశంలో పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలకు వ్యతిరేకంగా యువత చేపట్టిన ఉద్యమంగా మారింది.

ఈ ఉద్యమంలో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.

సీజేపీ జూన్ 20న జంతర్ మంతర్ వద్ద నిరసనలు ప్రారంభించింది. జూన్ 28న పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

గత వారాంతంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారన్న ఆరోపణల తర్వాత నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చాయి.

ADVERTISEMENT