Kotha Prabhakar Reddy: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో ఇద్దరు..?
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడు రాజు కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. మరోవైపు రాజు కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నం కేసులో కీలక ట్వీస్ట్ వెలుగులోకి వచ్చింది. నిందితుడు రాజుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాజుపై 307తో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేయగా, ఈ కేసులో రాజు ఏ1గా ఉన్నాడు.
గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు
నిందితుడు రాజుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు ఫిర్యాదు చేశాడు. మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపైనా కూడా దౌల్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మరోవైపు కత్తిపోటుతో ప్రభాకర్ రెడ్డికి చిన్నపేగుకు గాయమైంది. ఈ గాయానికి యశోద ఆస్పత్రిలో వైద్యులు నాలుగు గంటల పాటు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయనకి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరో నాలుగు రోజులు ఐసీయూలోనే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండనున్నారు.